డిజిటల్ అరెస్టు మోసాల కట్టడికి బయోమెట్రిక్​ సిమ్ వెరిఫికేషన్

డిజిటల్ అరెస్టు మోసాల కట్టడికి బయోమెట్రిక్​ సిమ్ వెరిఫికేషన్
దేశంలో గడిచిన కొన్ని నెలలుగా ‘డిజిటల్‌ అరెస్ట్‌’ మోసాలు పెరిగి పెనుముప్పుగా మారడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంతో డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌లను అరికట్టేలా కేంద్రం పలు నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలకు సంబంధించిన నివేదికను తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ డిజిటల్‌ అరెస్ట్‌ మోసాల కట్టడికి బయోమెట్రిక్‌ సిమ్‌ వెరిఫికేషన్‌, అనుమానాస్పద బ్యాంకు ఖాతాల నిలిపివేత వంటి ప్రతిపాదనలను కేంద్రం తన నివేదికలో పేర్కొంది. 

డిజిటల్ అరెస్ట్​ స్కామ్​ల ముప్పును ఎదుర్కొనేందుకు టెలికాం నియంత్రణ సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు, ఆర్​బీఐ, టెక్​ సంస్థలు, సీబీఐ సహకారంతో పలు చర్యలు చేపట్టినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందులో భాగంగా డిజిటల్​ అరెస్టు మోసాలకు, నేరాలకు పాల్పడుతున్న 9,400 వాట్సాప్​ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది.  వాస్తవానికి దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టు కేసులను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 9న ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్​ క్రైమ్ కో-ఆర్టినేషన్​ సెంటర్​ (14సీ) ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. సీజేఐ సూర్యకాంత్​ నేతృత్వంలోని ధర్మాసనం డిజిటల్ అరెస్టులతో సహా ఆన్​లైన్ మోసాలపై సుమోటోగా విచారణ చేపట్టింది. డిజిటల్ అరెస్టు కేసుల్లో నష్టపోయిన వారికి తగు పరిహారం అందించేందుకు ఒక ఫ్రేమ్​వర్క్​ను రూపొందించాలని, ఇందుకోసం ఆర్​బీఐ, టెలికమ్యునికేషన్ విభాగం, ఇతర సంస్థలను సంయుక్తంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే అటార్నీ జనరల్ ఆర్​.వెంకటరమణి ప్రభుత్వం తరఫున తాజా నివేదికను సుప్రీం కోర్టు ముందు దాఖలు చేశారు. ఇందులో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వాట్సాప్​పై తీసుకున్న చర్యలను వివరించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డీవోటీ ఆదేశాల మేరకు, వాట్సాప్​ డిజిటల్ అరెస్టు స్కామ్​లపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. 

“ఈ స్కామ్​లపై అత్యంత కఠినమైన పద్ధతులను ఉపయోగించి దర్యాప్తు నిర్వహించింది. ముందుగా ‘సీడ్​ సిగ్నల్స్ గుర్తించడం > నెట్​వర్క్​లను మ్యాప్ చేయడం > మొత్తం నెట్​వర్క్​పై చర్యలు తీసుకోవడం > ఆటోమేటెడ్ డిఫెన్స్​ నిర్మించడం’ లాంటి చర్యలు తీసుకుంది. దీని ద్వారా డిజిటల్ అరెస్టులతో ప్రమేయం ఉన్న 9400 ఖాతాలను బ్యాన్ చేసింది” అని ఆ నివేదికలో పేర్కొన్నారు.

“వినియోగదారుల రక్షణ కోసం వాట్సాప్​ పలు ఫీచర్స్​ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్చర్​లలో అధికారిక పోలీసు లేదా ప్రభుత్వ చిహ్నాలను ఉపయోగిస్తున్న ఖాతాలను తొలగించే లోగో డిటెక్షన్ వ్యవస్థలు తీసుకొచ్చింది. కొత్తగా క్రియేట్ చేసిన వాట్సాప్ అకౌంట్ల నుంచి కాల్ వస్తే, యూజర్లను హెచ్చరించే ఫీచర్​ను వాట్సాప్​ తీసుకురానుంది” అని వివరించారు. 

అలాగే అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వారి ప్రొఫైల్ ఫొటోలు కనిపించకుండా ఆటోమేటిక్​గా హైడ్ చేసే ప్రక్రియను త్వరలో ప్రవేశపెట్టనుంది. అలాగే ఫోన్​లో కేవైసీ పూర్తయిన సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్​ పనిచేసేలా “సిమ్ బైండింగ్​” విధానాన్ని 4 నుంచి 6 నెలల్లో అమలు చేస్తామని వాట్సాప్​ తెలిపింది.  ఇక అనుమానాస్పద, మోసపూరిత సిమ్​ కార్డులను గుర్తించిన 2 నుంచి 3 గంటల్లోనే వాటిని బ్లాక్ చేసేలా చేయడానికి కట్టుబడి ఉన్నట్లు డీవోటీ పేర్కొంది.

సిమ్​ కార్డుల జారీలో పారదర్శకత కోసం ‘బయోమెట్రిక్​ ఐడెంటిటీ వెరిఫికేషన్​ సిస్టమ్​’ను 2026 డిసెంబర్​ నాటికి అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.10 కోట్లకు పైగా నష్టం వాటిల్లిన డిజిటల్ అరెస్టు కేసులను సీబీఐ నేరుగా విచారణకు స్వీకరించనుంది. ప్రస్తుతం గుజరాత్​, దిల్లీకి చెందిన 3 ప్రధాన కేసులను సీబీఐ రీ-రిజిస్టర్​ చేసింది. ఇందులో దిల్లీకి చెందిన ఓ బాధితుడు ఏకంగా రూ.22.92 కోట్లు కోల్పోవడం గమనార్హం.