ఒక మతానికి చెందిన నిర్దిష్ట ఆచారం అత్యవసరమైనదా, అత్యవసరం కానిదా అని ప్రకటించడానికి అవసరమైన ప్రమాణాలను నిర్వచించడం న్యాయస్థానాలకు అసాధ్యం కాకపోయినా, చాలా కష్టమైన పని అని సుప్రీంకోర్టు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒక మతం అనుసరించే ఆచారాలన్నీ అత్యవసరమైనవిగా పరిగణించలేమని చెప్పింది.
ఒకవేళ అవి నైతికతకు, ప్రజా శాంతికి లేదా ఆరోగ్యానికి భంగం కలిగిస్తే వాటిని సమర్థించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అత్యవసరమైన అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎం ఎం సుందరేశ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్, జస్టిస్ ప్రసన్న బి వరలే, జస్టిస్ ఆర్ మహాదేవన్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీలు సభ్యులుగా ఉన్నారు.
రాజ్యాంగం ప్రకారం ఒక మతంలోని నిర్దిష్ట వర్గానికి చెందిన ఆచారాలకు రక్షణ ఉంటుంది. అయితే అవి నైతికత, ప్రజా శాంతి, ఆరోగ్యానికి విరుద్ధంగా ఉండకూడదు. ఒక మతం లేదా తెగ ఆచారాలను ఆ విశ్వాసులే నిర్ణయించుకోవాలని ఈ కేసులో హాజరైన సీనియర్ అడ్వకేట్ రాకేశ్ ద్వివేది వాదించారు. ఈ క్రమంలోనే 2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ వెలువడిన మెజారిటీ తీర్పును ద్వివేది తప్పుబట్టారు. మతం అనేది భావోద్వేగాలతో కూడుకున్నదని, అందుకే మతపరమైన ఆచారాల విషయంలో న్యాయస్థానాలు చాలా సున్నితంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు.
“వారు ఎలా పూజించాలి, ఎప్పుడు పూజించాలి అనేది భక్తులే నిర్ణయించుకోవాలి. పాత పద్ధతుల స్థానంలో కొత్త ఆలోచనలను తీసుకురావద్దు. భవిష్యత్తులో సమస్యలను సృష్టించే ఒక సాధనంగా దీనిని ఉంచుకోవద్దు. వారు ఎలా పూజించాలనుకుంటున్నారో నిర్ణయించుకునే విషయాన్ని ఆయా మత వర్గాలకే వదిలేయండి” అని సూచించారు.
“ప్రజలకు ఒక నిర్దిష్ట మతానికి, నిర్దిష్ట ఆలయానికి అనుబంధం ఉంటుంది. ఆ భావోద్వేగానికి భంగం కలిగితే వారు చాలా బలంగా ప్రతిస్పందిస్తారు. మతపరమైన ఆచారంపై ఒక చట్టాన్ని పరీక్షించేటప్పుడు కోర్టులు మరింత కఠినంగా ఉండాలి. మతం పేరుతో ఏదైనా దురుద్దేశం లేదా మోసం జరిగినట్లు ఆధారాలతో నిరూపితమైతే తప్ప, మతపరమైన ఆచారం ఎవరికీ హాని కలిగించకుండా ఉన్నప్పుడు కోర్టు ఆ ప్రశ్న జోలికి వెళ్లకుండా ఉండాలి” అని రాకేశ్ ద్వివేది కోర్టుకు విన్నవించారు.
ఈ క్రమంలోనే స్పందించిన జస్టిస్ నాగరత్న, హిందూ సమాజం తనను తాను ఏకం చేసుకోవాలని సూచించారు. “మేము ఒక వర్గం, వారు మరొక వర్గం అని మీరు అనలేరు. వారు ఒక ఆలయానికి రాకూడదు, మేము వారి ఆలయానికి వెళ్లలేము అనడం హిందూ సమాజం ఆలోచన కాకూడదు. ఇతరుల కోసం తలుపులు తెరవకపోతే హిందూ సమాజం నష్టపోతుంది” అని ఆమె ద్వివేదితో పేర్కొన్నారు. దీనికి సీనియర్ న్యాయవాది ద్వివేది సమాధానమిస్తూ తాను ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని చెప్పారు.
సామాజిక సంస్కరణల పేరిట ప్రభుత్వం మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవచ్చనే విషయంలో ఎటువంటి సార్వత్రిక లేదా విస్తృత మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మార్గదర్శకాలు ఆర్టికల్ 25(2)(బి) కిందకు వస్తాయా లేదా సంస్కరణల పేరిట అది మతపరమైన ఆచారాన్ని ఉల్లంఘించడమా అనేది ఎల్లప్పుడూ కేసును బట్టి ఉంటుందని పేర్కొంది.

More Stories
బెంగాల్, తమిళనాడులలో పోలింగ్ ప్రారంభం
ఈడీ దాడుల మధ్యలోకి మమతా వెళ్లడంపై సుప్రీం ఆగ్రహం
అంతర్జాతీయ సైనిక సంక్షోభాల్లో భారత్ పరిష్కరించే సమయం!