20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై థాక్రే సోదరులు

20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై థాక్రే సోదరులు
మహారాష్ట్ర రాజకీయాల్లో థాక్రే సోదరులు (ఉద్ధవ్‌ థాక్రే, రాజ్‌ థాక్రే)  దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్నారు. మరాఠీ తమ హక్కు అని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు.  ప్రాథమిక పాఠశాలల్లో హిందీని త‌ప్పనిసరి చేస్తూ తెచ్చిన త్రిభాషా విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ముంబయిలో నిర్వహించిన మెగా విజయోత్సవ సభలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. 
త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం  ఈ కార్యక్రమానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే ఇద్దరూ కలిసి హాజరయ్యారు. గత 11 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముంబయికి, మహారాష్ట్రకు ఏం చేశాయని ఉద్ధవ్ ప్రశ్నించారు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ద్వారా శివసేన (ఉద్ధవ్) చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరికీ తెలుసని స్పష్టం చేశారు. 
ముంబయిలోని ప్రముఖ పరిశ్రమలను సైలెంట్‌గా గుజరాత్‌కు తరలించుకుపోయారని ఆయన ఆరోపించారు. ఏ భాషకు తాము వ్యతిరేకం కాదని చెబుతూ అయితే ఏదైనా భాషను బలవంతం చేస్తే మా శక్తిని చూపిస్తామని ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. ‘బెంగాల్‌, తమిళనాడులో హిందీ అమలుకు ప్రయత్నిస్తారా?’ అని సవాల్‌ చేశారు.

తమ ఇద్దరు సోదరులను కలపడం బాలాసాహెబ్ ఠాక్రే వల్ల కూడా కాలేదని, ఫడ్నవిస్ సర్కారు చేష్టల వల్ల తమ మధ్య దూరం తొలగిపోయిందని రాజ్‌ థాక్రే ఎద్దేవా చేశారు. తాను హిందీ వ్యతిరేకిని కాదని, ఏ భాషనూ వ్యతిరేకించనని తేల్చి చెప్పారు. మరాఠా సామ్రాజ్యం చాలా ప్రాంతాలను పాలించినా, ఎన్నడూ ఆయాచోట్ల మరాఠీని బలవంతంగా రుద్దలేదని గుర్తు చేశారు.

కానీ హిందీని బలవంతంగా రుద్దే ప్రక్రియను మహారాష్ట్రలోనే ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోందని రాజ్ ఠాక్రే విమర్శించారు. దీన్ని మహారాష్ట్ర ప్రజలు వ్యతిరేకించకుంటే, ముంబయి నగరాన్ని రాష్ట్రం నుంచి వేరు చేసేందుకూ వెనుకాడరని మండిపడ్డారు.