మీనాక్షి నటరాజన్​ పిటిషన్​ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

మీనాక్షి నటరాజన్​ పిటిషన్​ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్ తిరస్కరణను సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉంటే, దానికి సంబంధించిన పరిష్కారం ఎన్నికల సంఘం వద్ద ఉంటుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్‌కర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 
 
మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి ఆమె వేసిన నామినేష‌న్‌ను రిట‌ర్నింగ్ అధికారి ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఆమెపై లీగ‌ల్ కేసు ఉన్న నేప‌థ్యంలో ఫామ్‌26 ప్ర‌కారం మీనాక్షీ నామినేష‌న్‌ను తిర‌స్క‌రించారు. అయితే అత్య‌వ‌స‌ర పిటీష‌న్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు స్పందిస్తూ గ‌తంలో నామినేష‌న్ల ప‌త్రాల‌ను తిర‌స్క‌రించిన కేసుల్లో ఎప్పుడైనా కోర్టు జోక్యం చేసుకున్న తీర్పులు ఉన్నాయా? అని మీనాక్షీ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని   ప్ర‌శ్నించింది.
 
ఏదైనా క్రిమిన‌ల్ కేసులో రెండేళ్ల శిక్ష ప‌డితేనే అప్పుడు స‌మాచారాన్ని వెల్ల‌డించాల‌ని, కానీ ప్ర‌స్తుత కేసులో కేవ‌లం స‌మ‌న్లు మాత్ర‌మే జారీ చేశార‌ని న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. త‌ప్పుడు ప‌ద్ధ‌తిలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ రిట్న‌రింగ్ అధికారి రాజ్య‌స‌భ నామినేష‌న్ ప‌త్రాల‌ను తిర‌స్క‌రించిన‌ట్లు సింఘ్వీ పేర్కొన్నారు. 
 
కానీ మీనాక్షీ న‌ట‌రాజ‌న్ అసంపూర్ణ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించిన‌ట్లు రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ అర‌వింద్ శ‌ర్మ పేర్కొన్నారు. ఫామ్ 26లో కోర్టు ఫిర్యాదు గురించి వెల్ల‌డించ‌లేద‌ని ఆర్వో చెప్పారు. తెలంగాణ‌లో రిజిస్ట‌ర్ అయిన కేసును మీనాక్షీ త‌న అఫిడ‌విట్‌లో పొందుప‌ర‌చ‌లేద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ అభ్య‌ర్థి మ‌హేశ్ కేవ‌త్ త‌న ఫిర్యాదులో పేర్కొన్న విష‌యం తెలిసిందే.