పాక్ కు చైనా ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్‌ల సరఫరా

పాక్ కు చైనా ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్‌ల సరఫరా
 
* పాక్ కీలక సైనిక స్థావరాలపై భారత్‌ దాడి నిజమే!

పాకిస్తాన్‌కు 40 షెన్యాంగ్ జే-35 ఐదోతరం స్టెల్త్ ఫైటర్ జెట్‌లను చైనా సరఫరా చేయనుందని తెలుస్తోంది. జే-35 జెట్‌లు పాక్‌కు చేరితే స్టెల్త్ టెక్నాలజీని నిర్వహిస్తున్న దేశాల జాబితాలో దాయాది చేరనుంది. ఈ ఫైటర్‌జెట్ల విషయాన్ని మాజీ ఐఏఎఫ్ ఫైటర్ పైలట్ అజయ్ అహ్లావత్ నిర్ధారించారు. ఫైటర్‌జెట్లు పాక్‌కు రాకముందే శిక్షణ కోసం పైలట్ల బృందం ఆరు నెలలకుపైగా చైనాలో ఉందని తెలిపారు.

పాకిస్థాన్‌కు ఎఫ్సీ-31 జెట్లను చైనా అందించవచ్చని పేర్కొన్నారు. ఎఫ్సీ-31 జెట్‌లు జే-35కి కొంచెం టోన్-డౌన్ వెర్షన్‌ అని చెప్పారు. పూర్తి వెర్షన్‌ను ఎవరూ ఇవ్వరని అజయ్ అహ్లావత్ తెలిపారు. ఎఫ్సీ-31 అనేది జే-35కి ఎగుమతి వేరియంట్. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్‌కు సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ విమానంతో పోలిస్తే తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉందని విస్తృతంగా ప్రచారం ఉంది.

ప్రస్తుతం భారత్‌ వద్ద జే-35, ఎస్యూ-57 యుద్ధ విమానాలు ఉన్నాయి. దేశీయ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించనున్న అడ్వాన్స్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌-అమ్కా పాక్‌ ఐదోతరం స్టైల్త్ ఫైటర్‌జెట్లకు సరైన సమాధానం చెబుతుందన్నారు. అయితే అవి భారత వైమానిక దళంలో చేరడానికి మరో పదేళ్ల సమయం పట్టవచ్చని అజయ్ అహ్లావత్ తెలిపారుఇలా ఉండగా, పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాక్‌ పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది.

ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఇన్నాళ్లూ తమకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోన్న పాక్‌ తాజాగా దాన్ని అంగీకరించింది. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా తమ కీలక సైనిక స్థావరాలపై భారత్‌ దాడులు నిజమే అని పాక్‌ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ దార్‌ తాజాగా వెల్లడించారు. రెండు కీలక ఎయిర్‌బేస్‌లపై భారత్‌ దాడి చేసినట్లు ఒప్పుకున్నారు.

రావల్పిండిలోని నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరం, షోర్‌కోట్‌ వైమానిక స్థావరాలను భారత్‌ లక్ష్యంగా చేసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల అనంతరం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు సౌదీ అరేబియా రంగంలోకి దిగిందని కూడా దార్ ఈ సందర్భంగా వెల్లడించారు. జియో న్యూస్‌తో ఇషాక్‌ దార్‌ మాట్లాడుతూ “మేము తిరిగి దాడి చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. భారత్‌ చాలా వేగంగా స్పందించింది” అని తెలిపారు. 

భారత్‌ దాడులు జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్‌ బిన్‌ సల్మాన్‌ తనను వ్యక్తిగతంగా సంప్రదించారని దార్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. సౌదీ యువరాజు తనను ఫోన్‌లో సంప్రదించినట్లు చెప్పారు. “పాకిస్థాన్‌ దాడులు ఆపేందుకు సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌కు తెలియజేయవచ్చా” అని తనని అడిగినట్లు దార్‌ వివరించారు.

ఆ సమయంలో కాల్పుల విరమణ చేద్దామని తామే భారత్‌ను అభ్యర్థించినట్టు కూడా ఇషాక్‌ దార్‌ అంగీకరించారు. నూర్‌ ఖాన్‌ తదితర ముఖ్య వైమానిక స్థావరాలపై దాడులు మొదలయ్యాక తాము భారత్‌కు ఈ ప్రతిపాదనను చేసినట్టు ఆయన తెలిపారు.