48 గంటల్లో సాంకేతిక లోపాలతో 8 విమానాల ల్యాండింగ్‌

48 గంటల్లో సాంకేతిక లోపాలతో 8 విమానాల ల్యాండింగ్‌
* బోయింగ్‌ 787 విమానాల్లో భద్రతా సమస్యల్లేవ్‌
వివిధ కారణాలతో ఎయిర్ ఇండియాకు చెందిన 8 అంతర్జాతీయ విమాన సర్వీసులు మంగళవారం రద్దయ్యాయి. సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ, విమానాలు అందుబాటులో లేవంటూ ఆయా సర్వీసులను రద్దు చేశారు. అయితే రద్దయిన ఈ విమాన సర్వీసుల్లో ఆరు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్లే.  అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్‌కు మంగళవారం మధ్యాహ్నం బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయింది.
తొలుత న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు సురక్షితంగా వచ్చిన ఈ విమానం లండన్‌ ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ సమస్య ఉత్పన్నమైనట్టు సమాచారం. దీంతో విమాన సర్వీసును రద్దు చేశారు. అయితే సాంకేతిక సమస్య వచ్చిందన్న వార్తలను ఎయిరిండియా తోసిపుచ్చింది. విమానం అందుబాటులో లేకపోవడం వల్లే సర్వీసును రద్దు చేసినట్టు తెలిపింది. మరోవైపు, ఢిల్లీ నుంచి పారిస్‌కు మంగళవారం బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానంలో అధికారులు సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో ఈ విమాన సర్వీసును రద్దు చేశారు.

శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబైకి ప్రయాణమైన ఎయిరిండియా విమానం మంగళవారం తెల్లవారుజామున కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండయ్యింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపేశారు. అనంతరం ప్రయాణికులను కిందకు దించేసి తనిఖీలు చేపట్టారు.  ఢిల్లీ నుంచి రాంచీకి బయల్దేరిన మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి ఆ విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు.

ఇంకోవైపు, ముంబై నుంచి అహ్మదాబాద్‌కు బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానంలోనూ పలు సమస్యలు వచ్చాయి. ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో డీజీసీఏ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ప్రతినిధులతో మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. నిర్వహణా సామర్థ్యంపై సమీక్షించింది.

అవన్నీ భద్రతా పరమైన తనిఖీలకు అనుగుణంగానే ఉన్నాయని, బోయింగ్‌ 787 విమానాల నిఘాలో ఎలాంటి పెద్ద భద్రతా సమస్యలు తలెత్తలేదని డీజీసీఏ తెలిపింది.  ఎయిర్ ఇండియా వద్దనున్న బోయింగ్ 787 రకం విమానాలన్నింటి నిర్వహణ వ్యవస్థలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన మరుసటి రోజే (జూన్ 13న) ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ మోడల్‌కు చెందిన అన్ని విమానాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని నిర్దేశించింది. 

దీంతో ఎయిరిండియా వద్దనున్న బోయింగ్ 787-8 రకానికి చెందిన 26, బోయింగ్ 787-9 రకానికి చెందిన 7 విమానాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలు జరుగుతుండటం వల్లే జూన్ 12 నుంచి జూన్ 17 వరకు బీ787 రకం విమానాలతో నడిచే 66 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ వ్యవధిలో బీ787 రకానికి చెందిన విమానాలతో 248 సర్వీసులను ఎయిరిండియా నడిపింది.