
పొగాకు బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్లకు 150 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కోరారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను పొగాకు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని సూచించారు. ఆయిల్ పాం దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం సూచించారు. మ్యాంగో పల్ప్పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పీయూష్ గోయల్ ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆదివారం దాదాపు రెండు గంటలపాటు సమావేశం అయ్యారు. బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్పై జీఎస్టీ తగ్గింపుపై ఇరువురు నేతలు మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.
పొగాకు ధరలు తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు సీఎం కేంద్ర మంత్రికి వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ.300 కోట్లలో పొగాకు బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఆయిల్ పాం దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని, తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం, కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. సీఫుడ్పై అమెరికా విధించిన 27 శాతం సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కోరారు. మ్యాంగో పల్ప్పై జీఎస్టీ తగ్గింపు అంశం ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సీఎం పీయూష్ గోయల్కు వివరించారు. సీఎంతో భేటీ అనంతరం పీయూష్ గోయల్ గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులు, ఎన్ ఇసిడిసితో సమావేశం అయ్యారు. రైతులు సమస్యలు, పొగాకు కొనుగోళ్లు అంశంపై చర్చించారు.
More Stories
అధిక పొగ వాహనాలకు తిరుమలలో ప్రవేశం లేదు
అన్యమత ప్రార్థనల్లో టీటీడీ ఏఈఓ సస్పెండ్
గరివిడిలోని వెటర్నరీ కాలేజ్కి శాశ్వత సభ్యత్వం