బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుతో పాటు తరుణ్ రాజ్ కొండూరుకు బెంగళూరు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 2 లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. అధికారులు పిలిచిన సమయంలో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించ వద్దని, దర్యాప్తు అధికారులకు సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ల కూడదని , భవిష్యత్తులో ఇదే తరహాలో నేరాల్లో పాల్గొనవద్దని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 60 రోజుల్లోగా ఛార్జిషీట్ను దాఖలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వీరు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
కన్నడ నటి అయిన రన్యారావును మార్చి 3న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. విమానాశ్రయంలో ఆమెను అదుపు లోకి తీసుకుని రూ. 12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో తరుణ్రాజ్, సాహిల్ సకారియా జైన్లను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు బెంగళూరులో పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు.
ఇదిలా ఉండగా, కేంద్రం ముగ్గురిపై ఏప్రిల్ 22న కొఫిపోసా చట్టాన్ని ప్రయోగించింది. బెయిల్ లేకుండా దాదాపు సంవత్సరం పాటు నిందితులను నిర్బంధించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఇటీవల రన్యా తల్లి చట్టం కింద ఆమెను నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై అభ్యంతరాలు దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ జూన్ 3 వ తేదీకి వాయిదా పడింది.
More Stories
2024 సార్వత్రిక ఎన్నికల వ్యయంలో 45 శాతం బిజెపి
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు
రూ.3 వేల కొత్త ఫాస్టాగ్ తో ఏడాదంతా ప్రయాణం