నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రూ.142 కోట్లు లబ్ధి

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రూ.142 కోట్లు లబ్ధి
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు  నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా వారు రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తన వాదనలు వినిపించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. 
నవంబర్‌ 2023లో నేషనల్ హెరాల్డ్‌తో ముడిపడి ఉన్న రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసే వరకూ ఆ నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సోనియా, రాహుల్‌ అనుభవించారని కోర్టుకు తెలిపారు.
హెరాల్డ్‌ పేపర్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీని ఈడీ గతంలో విచారించింది. విదేశీ నిధులతో నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను నడిపారన్న ఫిర్యాదు మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అయితే, సీబీఐ విచారణ అర్ధాంతరంగానే నిలిచిపోగా.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతూ వస్తుంది. ఇటీవల ఈ కేసులో 2023, నవంబర్‌లో జప్తు చేసిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజెఎల్)కి చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించి, నోటీసులు జారీ చేసింది. 
 
ఈడీ ఇప్పటి వరకు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌, యంగ్‌ ఇండియాకు చెందిన దాదాపు రూ.751.9కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఆయా ఆస్తుల్లో అద్దెకు ఉంటున్న వారు తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్‌ (8) నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పింది.నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1938లో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించారు. దీన్ని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అంటే ఏజేఎల్‌ ప్రచురించింది. 2008లో ఆర్థిక సంక్షోభం తర్వాత ఈ వార్తాపత్రిక మూసివేశారు. అయితే, ఇక్కడే ఈ వివాదం ప్రారంభమైంది. దీని తర్వాత 2010లో, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) అనే కంపెనీ ఏర్పడింది.  వైఐఎల్​లో రాహుల్​కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. 

ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్‌లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది. 2025 ఏప్రిల్ 9న మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద చార్జిషీట్ దాఖలు చేసింది. 

ఈ కేసులో సోనియా గాంధీని ఏ1గా, రాహుల్ గాంధీని ఏ2గా ఈడీ చేర్చింది. కాంగ్రెస్ నాయకులు సామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి వారు కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి 2012లో వైఐఎల్‌ రూ.2వేలకోట్లకుపైగా విలువైన ఏజేఎల్‌ ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు కోనుగోలు చేసిందని, ఇది మోసమని ఆరోపించారు. 

ఇక ఈడీ చార్జిషీట్‌పై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరికొందరు నేతలపై చార్జిషీట్ దాఖలు చేయడం అనేది ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం, బెదిరింపులకు ప్రత్నించడమే తప్ప మరొకటి కాదని విమర్శించారు. భారత జాతీయ కాంగ్రెస్‌, దాని నాయకత్వం మౌనంగా ఉండదని హెచ్చరించారు.