అందాల పోటీలకు స్లీపర్ సెల్స్ ముప్పు!

అందాల పోటీలకు స్లీపర్ సెల్స్ ముప్పు!
భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధ వాతావరణం  నెలకొన్న నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉన్న స్లీపర్‌సెల్స్‌ నిద్ర లేచాయని, ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలిసింది. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా ఉగ్రదాడులు ఉండవచ్చని, ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీల నిర్వహణ మీద స్లీపర్‌సెల్స్‌ దృష్టి సారించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించినట్టు  తెలిసింది.

అవుట్‌డోర్‌ ప్రాంతాల్లో నిర్వహించే అందాల పోటీల ఈవెంట్స్‌ను డేగ కండ్లతో నిశితంగా గమనించాలని ఆదేశించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానిక సైన్యం సహకారం తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలకు మూడు వారాలపాటు పూర్తిస్థాయి భద్రత కల్పించడం తెలంగాణ పోలీసులకు పెద్ద సవాల్‌ కానున్నది.

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే పోటీదారులకు బస ఏర్పాటుచేసిన హోటల్‌లోనే పోలీసులు కూడా ‘‘మల్టీ ఏజెన్సీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’’ను ఏర్పాటు చేశారు. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్స్‌ను రంగంలో దించారు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పోలీసు ఐటీ విభాగం కీలకంగా ఉండగా, దాదాపు 40 మంది వివిధ పనుల బాధ్యతలను చూస్తున్నారు. మరోవైపు హోటల్‌తో పాటు గచ్చిబౌలి ప్రాంతంలో డోన్లను వినియోగించేందుకు అవకాశం లేకుండా ‘‘నో డ్రోన్‌’’ జోన్‌గా ప్రకటించారు. 

 
హోటల్‌ దగ్గర మహిళా పోలీసులకే డ్యూటీలు వేశారు. హోటల్‌తో పాటు పరిసర ప్రాంతంలో కలిపి దాదాపు 2 వేల మంది పోలీసులు డ్యూటీల్లో ఉండనున్నారు. ఆక్టోప్‌సలో రెండు టీమ్‌లను ఏర్పాటుచేశారు. డాగ్‌ స్వ్కాడ్‌ కూడా హోటల్‌ దగ్గర ఉంది.  హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో స్లీపర్‌సెల్స్‌ ఉన్నారని, వీరి కదలికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించినట్లు తెలిసింది.

మిస్‌ వరల్డ్‌ పోటీలను స్లీపర్‌సెల్స్‌ టార్గెట్‌ చేసే ప్రమాదం ఉన్నదని, ఆయా దేశాల నుంచి వచ్చిన సుందరాంగులు, విదేశీ మీడియా ప్రతినిధుల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌లో స్లీపర్‌సెల్స్‌ కదలికలపై గట్టి నిఘా పెట్టాలని సూచించినట్టు సమాచారం.  షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 10న మిస్‌ వరల్డ్‌ ప్రారంభ వేడుకల అనంతరం సుందరాంగులంతా 12వ తేదీ నుంచి నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, హైదరాబాద్‌లోని చార్మినార్‌, లాడ్‌బజార్‌, వరంగల్‌ వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మహబూబ్‌నగర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే విధంగా తెలంగాణ టూరిజం ప్రణాళికలు రూపొందించింది.

ఈ అవుట్‌డోర్‌ ఈవెంట్‌లే భద్రతకు సవాల్‌గా మారే అవకాశం ఉన్నదని పోలీసులు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. చార్మినార్‌, లాడ్‌బజార్‌, రామప్ప ఆలయం, పిల్లలమర్రి తదితర ప్రాంతాలను అతి సున్నిత ప్రాంతాలుగా గుర్తించినట్టు తెలుస్తున్నది.