
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై సాయుధ దళాలు నిర్వహించిన దాడుల గురించి సీనియర్ కేబినెట్ మంత్రులు గురువారం కీలక ప్రతిపక్ష నాయకులతో సహా రాజకీయ పార్టీలకు వివరించారు. అయితే, అప్పటివరకు కూడా ఆగకుండా ఆపరేషన్ సిందూర్ తర్వాత కొన్ని గంటల్లోనే, సైద్ధాంతిక, రాజకీయ విబేధాలను పక్కనబెట్టి దాదాపు ప్రతిపక్ష నేతలందరూ ప్రభుత్వంకు సంఘీభావం ప్రకటించారు. మన సైనిక దళాల వీరోచిత చర్యను ప్రశంసించారు.
ఏప్రిల్ 22 పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన మరుసటి రోజే దాడికి పాల్పడినవారు, వారి నిర్వాహకులపై ప్రభుత్వం తీసుకొనే ఏ చర్యకైనా ప్రతిపక్షం బేషరతుగా మద్దతు ప్రకటించినప్పటికీ, తరువాతి రోజుల్లో కాంగ్రెస్ “భద్రత, నిఘా లోపాలు” అంశాలను ఎత్తి చూపింది. కాలపరిమితిలో జవాబుదారీతనాన్ని నిర్ణయించాలని, “ఒక దేశంగా పాకిస్తాన్కు గుణపాఠం నేర్పడానికి, ఉగ్రవాదాన్ని నిర్ణయాత్మకంగా అరికట్టడానికి మన సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని” అంటూ పేర్కొనడం గమనార్హం.
అయితే, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి తమ మద్దతు ఇవ్వడానికి తాజాగా ప్రదర్శించిన మానసిక స్థితిని అంతకు ముందు రోజుకన్నా భిన్నంగా ఉంది. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత, పుల్వామా బాంబు దాడి తర్వాత, లోక్సభ ఎన్నికల ప్రచారం మధ్య, 21 ప్రతిపక్ష పార్టీలు అధికార బిజెపి సాయుధ దళాల త్యాగాలను (ఉగ్రవాద దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది మరణించారు) “స్పష్టమైన రాజకీయీకరణ” చేయడం పట్ల “బాధపడుతున్నట్లు” ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
కొన్ని రోజుల తరువాత, బాలాకోట్లో వైమానిక దాడులతో పాకిస్తాన్కు కలిగించిన నష్టానికి మోదీ ప్రభుత్వం “సాక్ష్యం” ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ పార్టీని తీవ్రంగా ఇరకాటంలోకి నెట్టివేశారు. బిజెపి తన లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఇటువంటి “జాతీయ వ్యతిరేక” వ్యాఖ్యలను పెద్ద ఎత్తున ఎండగట్టింది.
బిజెపి దూకుడుగా స్పందించడం వల్ల 2016లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద లాంచ్ప్యాడ్లపై ప్రతిపక్షాలు “సర్జికల్ స్ట్రైక్స్” గురించి “వివరాలు లేకపోవడం” గురించి ప్రశ్నలు లేవనెత్తినప్పటి నుండి ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. సెప్టెంబర్ 18న ఉరి సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడిలో 19 మంది మరణించారు.
ఉరికి ప్రతిస్పందనగా, 2016 సెప్టెంబర్ 28-29 రాత్రి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన ఒక రోజు తర్వాత, మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి వివరణ ఇచ్చింది. అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడానికి కారులో వచ్చారు. ఆమె ఆసుపత్రిలో చేరిన తర్వాత బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
ప్రభుత్వం కొన్ని కార్యాచరణ వివరాలను అందించినప్పటికీ, కుప్వారా, పూంచ్ అంతటా రెండు చోట్ల ఆర్మీ ఆపరేషన్లు జరిగాయని చెప్పడంతో తమ పార్టీ “ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది” అని సోనియా ఈ సందర్భంగా ఓ ప్రకటన చేశారు. ఈ దాడులను “మన భద్రతా దళాలు, మన ప్రజలపై మరింత చొరబాట్లు, దాడులను నిరోధించాలనే మన దేశం యొక్క సంకల్పాన్ని తెలియజేసే బలమైన సందేశం” అని ఆమె పేర్కొన్నారు.
రాహుల్ సహితం ఓ ట్వీట్ చేశారు: “ఉగ్రవాదానికి, దానిని సమర్ధించే, స్పాన్సర్ చేసే వారికి వ్యతిరేకంగా మనమందరం దృఢంగా ఐక్యంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ, నేను భారత సైన్యానికి, మన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నాము” అని ప్రకటించారు. అయితే, కొన్ని రోజుల తర్వాత, రాహుల్ ప్రధాని మోదీ “జవాన్ల రక్తం మీద రాజకీయాలు ఆడుతున్నారని” ఆరోపించారు.
“నేను సర్జికల్ స్ట్రైక్స్ను పూర్తిగా సమర్థిస్తున్నాను. నేను స్పష్టంగా చెప్పాను. కానీ దేశవ్యాప్తంగా రాజకీయ పోస్టర్లు, ప్రచారంలో భారత సైన్యాన్ని ఉపయోగించడాన్ని నేను సమర్థించను” అని ట్వీట్ ఇచ్చిన రాహుల్ వైఖరిపై బిజెపి మాత్రమే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విమర్శలు గుప్పించింది. రాహుల్ “దలాలీ” వంటి పదాలను ఉపయోగించకూడదని అరవింద్ కేజ్రీవాల్ హితవు చెప్పారు. ఆ సమయాల్లో అందరూ ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
“మన జవాన్ల గురించి రాహుల్ గాంధీ చెప్పిన దానిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని ఆప్ కన్వీనర్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో, అప్పటి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఇలా అన్నారు: “కొన్ని పార్టీలు సర్జికల్ స్ట్రైక్స్ను ప్రశ్నించడానికి ప్రయత్నించాయి, మరికొన్ని సందేహాలను కూడా లేవనెత్తాయి. మన భారత సాయుధ దళాలను అవమానించిన వారందరినీ నేను ఖండిస్తున్నాను.”
కాగా, బుధవారం ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించిన వెంటనే, పార్టీ లైన్పై ఎటువంటి గందరగోళం లేదని నిర్ధారించుకోవడానికి కాంగ్రెస్ తన అందుబాటులో ఉన్న సిడబ్ల్యుసి సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో సమయం వృధా చేయలేదు. “మేము చర్చించాము… మన దళాలకు పూర్తి మద్దతు, వారికి శుభాకాంక్షలు, వారికి చాలా ప్రేమ, కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి మద్దతు” అని రాహుల్ ప్రకటించారు.
ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మధ్య సున్నితమైన తేడాను చూపిస్తూ ఆ రోజు ఇతర పార్టీల నేతలు కూడా ప్రశంసించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సూచన మేరకు కాంగ్రెస్ తన సంవిధాన్ బచావో ర్యాలీలతో సహా తన అన్ని రాజకీయ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక కాంగ్రెస్ ‘ఎక్స్’ హ్యాండిల్లోని ఒక పోస్ట్ను, ఆ రోజు ప్రారంభంలో తొలగించారు. దాని స్థానంలో సాయుధ దళాలను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ను ఉంచారు. మునుపటి పోస్ట్ ఇలా ఉంది: “మానవజాతికి అత్యంత శక్తివంతమైన ఆయుధం శాంతి – మహాత్మా గాంధీ”.
మన సాయుధ దళాలను అభినందించడానికి చాలా మంది నాయకులు ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం కూడా వేచి ఉండలేదు. “పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను మూసివేశిన మన భారత సాయుధ దళాల పట్ల మేము చాలా గర్వపడుతున్నాము. పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రోజు నుండి, సరిహద్దు ఉగ్రవాదంపై ఏదైనా నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ సాయుధ దళాలు, ప్రభుత్వంతో స్పష్టంగా నిలబడింది. గతంలో జాతీయ ప్రయోజనాలే మాకు అత్యున్నతమని మా నాయకులు చూపించారు,” అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెల్లవారుజామున సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు.
“మన సాయుధ దళాల పట్ల గర్వంగా ఉంది. జై హింద్,” అని రాహుల్ వెంటనే తెలిపారు. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమిళనాడు భారత సైన్యంతో నిలుస్తుంది. మన సైన్యంతో, మన దేశం కోసం,” అని మోదీ ప్రభుత్వంతో వరుస ఘర్షణలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పోస్ట్ చేశారు.
మోదీ ప్రభుత్వం తరచుగా దాడి చేస్తున్న మాజీ యుపిఎ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆపరేషన్ సిందూర్ను “ప్రారంభం మాత్రమే” అని పిలిచారు. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం ఆధీనంలో ఉన్న స్థానాల వెనుక ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడానికి భారత సైన్యం నిర్ణయాత్మకంగా కదులుతుందని తనకు ఖచ్చితంగా తెలుసునని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
“భారత సైన్యం ధైర్యం ప్రతి పౌరుడి విశ్వాసం. మనమందరం కలిసి ఉన్నాము. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్నాము. భారతదేశానికి నమస్కారం” అని ఆప్ నాయకుడు కేజ్రీవాల్ చెప్పారు. “భారత సైన్యం ప్రతిసారీ తల్లుల గర్భాలను, సోదరీమణుల మణికట్టును, వారి నుదిటిపై ఉన్న సిరిసంపదను కాపాడింది. ఉగ్రవాదాన్ని పెంచే వ్యక్తులు మన ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని దాడి చేస్తే, ఎలా ఐక్యంగా ఉండాలో మనకు తెలుసు… ఈ పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులు భారత సైన్యం, ప్రభుత్వంతో ఉన్నారు” అని రాబోయే బీహార్ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా కఠినమైన పోరాటాన్ని ఎదుర్కొంటున్న ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ ప్రకటించారు.
బిజెపి వ్యతిరేక స్వరాలలో అగ్రగామిగా ఉన్న సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష నాయకుల నుండి కూడా ఇలాంటి ప్రశంసాత్మక ప్రకటనలు వచ్చాయి. “భారతదేశానికి దృఢంగా స్పందించడం తప్ప వేరే మార్గం లేదని సిపిఐ విశ్వసిస్తుంది” అని ప్రధాన కార్యదర్శి డి రాజా చెప్పారు. సిపిఐ నాయకుడు మోదీ ప్రభుత్వాన్ని అసాధారణంగా ప్రశంసిస్తూ, ఆయన ఇలా అన్నారు:
“దాడుల లక్ష్యంగా చేసుకున్న స్వభావం, పాకిస్తాన్ సైనిక ఆస్తులను తప్పించడం, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మాత్రమే దృష్టి పెట్టడం, పూర్తి స్థాయి సంఘర్షణను ఆహ్వానించకుండా జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వడం, క్రమాంకనం చేయబడిన, తీవ్రతరం కాని విధానాన్ని ప్రదర్శిస్తుంది.” అదే సమయంలో, “మరింత ఉద్రిక్తతలను నివారించడానికి, శాంతిని కాపాడటానికి దౌత్య మార్గాలను అనుసరించాలని” ఆయన సూచించారు.
ప్రతిపక్షాలు ఈ విధంగా సానుకూల స్పందనలు ఇవ్వడానికి పహాల్గమ్ లో ఉగ్రదాడి జరిగిన వెంటనే జమ్మూ కాశ్మీర్ ప్రజలు మొదటిసారిగా వీధులలోకి వచ్చి నిరసనలు జరపడం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బంద్ జరపడం, దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రవేశాలు వ్యక్తం కావడం, ప్రభుత్వం కఠినంగా జవాబు ఇవ్వాలనే డిమాండ్ పెరగడమే కారణంగా కనిపిస్తున్నది. ఇటువంటి వత్తిడుల కారణంగానే మొదటిసారి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది. మజ్లీస్ నేత అసదుద్దీన్ ఒవైసి వంటి వారు పాకిస్థాన్ పై కఠినంగా ప్రకటనలు ఇవ్వాల్సి వచ్చింది.
More Stories
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు
మావోయిస్టు అగ్రనేత హతంపై ప్రధాని, హోంమంత్రి హర్షం