దావూద్ ఇబ్రహీం- ​ రాణా సంబంధాలపై ఎన్ఐఏ ఆరా!​

దావూద్ ఇబ్రహీం- ​ రాణా సంబంధాలపై ఎన్ఐఏ  ఆరా!​
అమెరికా నుంచి తీసుకొచ్చిన 26/11 ముంబయి ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్నాడు. ఉగ్రదాడులకు ప్రణాళిక రచించేందుకు సాయం చేసినవారి వివరాలను రాణా నుంచి రాబట్టడంపై అధికారులు దృష్టి సారించారు. పెద్ద ఎత్తున దాడులకు ఎలా ప్లాన్ చేశారు? ఎవరెవరి ప్రమేయం ఉంది? వంటి విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ దాడుల వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు హస్తం ఉందా? దావూద్​కు రాణాకు ఏమైనా లింకు ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఓ మిస్టరీ వ్యక్తి 2006లో డేవిడ్‌ హెడ్లీని ముంబయిలో రిసీవ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. దుబాయ్​కు చెందిన ఆ వ్యక్తికి దాడి ప్రణాళికలు గురించి తెలుసని ఎన్ఐఏ భావిస్తోంది.

అతడికి దావూద్ ఇబ్రహీంతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. అలాగే పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, లష్కరే తోయిబాతో రాణాకు ఉన్న సంబంధాలపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ముంబయి దాడుల ప్రధాన కుట్రదారులైన తహవూర్ రాణా, హెడ్లీ మధ్య జరిగిన ఫోన్ కాల్స్​పై కూడా ఎన్ఐఏ దృష్టిపెట్టింది. 

ఈ ఫోన్ కాల్ సంభాషణల ద్వారా కీలక వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుల కార్యాచరణ వివరాలు, దాడుల వెనుకున్న వారి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ కాల్స్ పనికొస్తాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రాణా వాయిస్‌ నమూనాను సేకరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఈ నమూనాల ద్వారా ముంబయి ఉగ్రదాడుల సమయంలో ఇతరులతో అతడు మాట్లాడినట్లు అనుమానిస్తున్న పలు కాల్‌ రికార్డ్​లను ధ్రువీకరించే అవకాశం ఉంది. అయితే వాయిస్ నమూనా కోసం నిందితుడి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ అతడు అందుకు నిరాకరిస్తే అధికారులు న్యాయస్థానం నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టు అంగీకారం తెలిపిన అనంతరం అతడి వాయిస్​ను రికార్డ్‌ చేసుకోవచ్చు.

26/11 ముంబయి ఉగ్రదాడి కేసులో అరెస్టైన తహవూర్ హుస్సేన్ రాణా ఒకరని ఎన్ఐఏ కోర్టు తెలిపింది. ఉగ్రదాడుల్లో రాణా ప్రమేయంపై తగిన ఆధారాలు ఎన్ఐఏ వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి రాణాకు కస్టడీ విచారణ అవసరమని అభిప్రాయపడింది.  తహవ్వుర్ రాణాకు 18 రోజుల కస్టడీ విధించిన సమయంలో ఎన్ఐఏ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కేసులో ఆరోపణలు దేశ భద్రతకు సంబంధించినవని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

రాణా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని చిచ్‌బుట్నీలో జన్మించాడని,  అతనికి పాకిస్తాన్ సైనిక యూనిఫాం పట్ల గొప్ప వ్యామోహం ఉందని,  బలమైన భారత వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నాడని అతని సమాధానాలను బట్టి ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది.  సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ వంటి ఇతర ఉగ్రవాదులను కలవడానికి, అతను తరచుగా మారువేషాలలో ఆర్మీ యూనిఫామ్‌లను ధరించేవాడు.

 
పదవీ విరమణ చేసిన తర్వాత కూడా, అతను పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ లతో  సంబంధం కలిగి ఉన్నాడు. అతను లష్కర్-ఎ-తోయిబా శిబిరాలు, హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామి  కింద ఉన్న ప్రాంతాలలో కనిపించాడు.