అరెస్టుకు కారణం చెప్పకపోతే బెయిల్‌ ఇవ్వొచ్చు

అరెస్టుకు కారణం చెప్పకపోతే బెయిల్‌ ఇవ్వొచ్చు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు కారణాన్ని తెలియజేయడం తప్పనిసరి అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్‌కు కారణం తెలియజేయని పక్షంలో చట్టబద్ధమైన పరిమితులు ఉన్నప్పటికీ బెయిల్‌ మంజూరు చేయవచ్చని పేర్కొంది. దిగువ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ ఆర్డర్‌ను పక్కన పెట్టింది. 
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంజీత్ సింగ్‌పై 2024 ఫిబ్రవరి 15న మోసం, బెదిరింపు, శాంతికి భంగం వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. పోలీసులు అతడ్ని వెంటనే అరెస్ట్‌ చేశారు. 2024 డిసెంబర్‌ 26న ఆ వ్యక్తి జ్యుడీషియల్‌ కస్టడీకి రాంపూర్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మంజీత్ సింగ్‌ ఆ కోర్టు ఉత్తర్వును అలహాబాద్ హైకోర్టులో సవాల్‌ చేశాడు. 
 

ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరోపణలు తప్పని ఆయన తరుఫు న్యాయవాది వాదించారు. చట్టవిరుద్ధంగా అరెస్ట్‌ చేశారని, రిమాండ్‌ విచారణలో విధానపరమైన లోపాలున్నాయని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు కారణాలను అరెస్ట్‌ సమయంలో పిటిషనర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయలేదని పేర్కొన్నారు.మరోవైపు పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వాదనలను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టుకు గల కారణాలను తెలియజేయడం అనేది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ‘ఆర్టికల్ 22(1)ను ఉల్లంఘించినప్పుడు, నిందితులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడం న్యాయస్థానం విధి. 

చట్టబద్ధమైన ఆంక్షలు ఉన్నప్పటికీ బెయిల్ మంజూరు చేయడానికి అది కారణం అవుతుంది’ అని న్యాయమూర్తులు మహేష్ చంద్ర త్రిపాఠి, ప్రశాంత్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది.

కాగా, అరెస్టైన వ్యక్తికి ప్రాథమిక వాస్తవాల గురించి తగినంత అవగాహన కల్పించి, అతడికి అర్థమయ్యే భాషలో అరెస్టుకు గల కారణాలకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాంపూర్‌ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆర్డర్‌ను పక్కన పెట్టింది. అలాగే పిటిషనర్ మంజీత్ సింగ్‌ అరెస్టును రద్దు చేసింది. ఏప్రిల్‌ 9న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.