జమ్మూ కాశ్మీర్‌లో ఓ సైనికుడు ముగ్గురు ఉగ్రవాదుల మృతి

జమ్మూ కాశ్మీర్‌లో ఓ సైనికుడు ముగ్గురు ఉగ్రవాదుల మృతి
జమ్మూ కాశ్మీర్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పులలో ఒక సైనికుడు, ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జెసిఓ) అమరుడయ్యారని, ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేశామని సైన్యం శనివారం తెలిపింది. 

శుక్రవారం రాత్రి కేరీ భట్టల్ ఫార్వర్డ్ అటవీ ప్రాంతంలోని ఒక వాగు దగ్గర భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదుల గుంపు కదలికను ఆర్మీ సిబ్బంది గుర్తించారు. చొరబాటుదారులను సైనికులు సవాలు చేశారు, ఇది చాలా కాలం పాటు కొనసాగిన తీవ్రమైన కాల్పులకు దారితీసిందని ఓ వార్తా సంస్థ నివేదించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జెసిఓ గాయపడి, తరువాత మరణించాడు. అప్పటి నుండి ఆ ప్రాంతాన్ని సీలు చేశారు.

అదనపు బలగాలను మోహరించి గాలింపు చర్యలు జరుపుతున్నారు. ఫిబ్రవరి 11న అదే ప్రాంతంలో జరిగిన ఘోరమైన ఎన్‌కౌంటర్ తర్వాత ఈ సంఘటన జరిగింది. ఉగ్రవాదులు ప్రేరేపించిన ఐఇడి పేలుడులో ఒక కెప్టెన్‌తో సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరొకరు గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారత, పాకిస్తాన్ దళాల మధ్య బ్రిగేడ్ కమాండర్ స్థాయి సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత తాజా ఎన్‌కౌంటర్ కూడా జరిగింది.

మరోవంక, కిష్త్వార్‌లోని ఛత్రు అటవీ ప్రాంతంలో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. జైష్-ఎ-మొహమ్మద్ కమాండర్ సైఫుల్లాతో సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగతా ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులుగా సమాచారం.

నిఘా వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ 9న ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సెర్చ్ సమయంలో ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. ఒక ఉగ్రవాది హతమైనట్లు ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది. తరువాత, మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు జాతీయ మీడియా నివేదించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటనలు రాలేదు.

కథువాలో సరిహద్దులోకి చొరబడిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం తెలిపింది. దోడా జిల్లాలోని భదేర్వే సెక్టార్‌లో ఉగ్రవాదుల ఉనికిపై సమాచారం అందడంతో నిఘాను ముమ్మరం చేశారు. 

గత 19 రోజుల్లో కథువా, ఉధంపూర్, కిష్త్వార్‌లలో ఐదు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. వీటిలో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. నలుగురు పోలీసు సిబ్బంది మృతి చెందారు. ఇదిలా ఉండగా, అఖ్నూర్ సెక్టార్‌లోని కేరీ బట్టల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి  ఇటీవల పాకిస్తాన్ సైన్యం మళ్ళీ కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు తెలిసింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో దాదాపు డజను సరిహద్దు కాల్పుల సంఘటనలు, ఐఇడి దాడి తర్వాత సరిహద్దు నిర్వహణ ,  ఉద్రిక్తతలను తగ్గించడం వంటి అంశాలను పరిష్కరించడం ఈ సమావేశం లక్ష్యం. కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలు, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలపై సమావేశంలో భారత సైన్యం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.