నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ రూ 661 కోట్ల స్వాధీనం!

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ రూ 661 కోట్ల స్వాధీనం!
నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు తాజాగా ఈడీ  నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఈడీనే ప్రకటించింది.  ఈ మేరకు ఢిల్లీ, ముంబై, లక్నోల్లోని ఆస్తులపై నోటీసులు అతికించినట్లు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని, లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని ఆ ప్రకటనలో ఆదేశించింది. పీఎంఎల్‌ఏ చట్టం కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ప్రచురణకర్తగా ఉంది.

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ సహా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న ‘యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’  ఏజేఎల్‌ కు యాజమాన్య సంస్థ.కాంగ్రెస్‌కు ఏజేఎల్‌ బకాయిపడ్డ రూ.90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో ‘యంగ్‌ ఇండియన్‌’లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి.

ఈ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. దర్యాప్తులో భాగంగానే 2023 నవంబర్‌లో సంబంధిత స్థిరాస్తులతోపాటు ఏజేఎల్‌లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న ‘యంగ్‌ ఇండియన్‌’ కు చెందిన రూ.90.21 కోట్లను జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలతోపాటు ప్రస్తుత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ నేత పవన్‌ కుమార్‌ బన్సల్‌లను ఈడీ ఇప్పటికే విచారించింది. వారి స్టేట్‌మెంట్లనూ రికార్డు చేసింది. తాజాగా సంబంధిత స్థిరాస్తుల స్వాధీనానికి నోటీసులు ఇచ్చింది.