మార్చి 14న జరిగిన అగ్నిప్రమాదంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ దర్యాప్తు ప్రారంభించకముందే, శనివారం రాత్రి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాథమికంగా వెల్లడించిన నివేదికలతో ఆయనను దోషిగా ప్రాధమికంగా తేల్చిచెప్పినట్లు కనిపిస్తుంది.
జస్టిస్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా శనివారం పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిఎస్ సంధవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేశారు.
జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ నివేదికను అందుకున్న తర్వాత, జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి ఎటువంటి న్యాయపరమైన పనిని అప్పగించవద్దని సిజెఐ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు.ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని తన నివేదికలో జస్టిస్ ఉపాధ్యాయ స్పష్టం చేశారు.
అసాధారణమైన రీతిలో, జస్టిస్ వర్మ నివాసం నుండి నగదు దొరికినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోటోలు, వీడియోలతో కూడిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ విచారణ నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. దానితో పాటు ఆరోపణలను ఖండిస్తూ జస్టిస్ వర్మ ప్రతిస్పందన కూడా ఉంది.
కాగా, న్యాయవ్యవస్థలో అవినీతిని ఏమాత్రం సహించకూడదని సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో అవినీతిని సున్నా సహనంతో చూడాలని ఆయన కోరారు.న్యాయాన్ని అమ్మేవారిని అరెస్టు చేయాలని, న్యాయవ్యవస్థలో నల్ల గొర్రెలను గుర్తించి, తొలగించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.
అయితే, జస్టిస్ ఉపాధ్యాయ నివేదికను ప్రచురించడాన్ని సింగ్ ప్రశ్నించారు. ఇది ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ పనిని కష్టతరం చేస్తుందని చెప్పారు.“వీడియో నమ్మదగిన సాక్ష్యం కాదు. అగ్నిమాపక నివేదిక ఇక్కడ లేదా అక్కడ లేదు … న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఉన్న విషయాలను విచారణ పూర్తయ్యే ముందు బహిరంగపరచకూడదు” అని సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘‘మంటలు చెలరేగిన స్టోర్ రూమ్లో పనికిరాని వస్తువులు, పాడైపోయిన గృహపకరణాలు, పాత ఫర్నిచర్, పరుపుల వంటివాటిని పడేస్తాం. పనివారికి, తోటపని చేసేవారికి కొన్ని సందర్భాల్లో సీపీడబ్ల్యూడీ (కేంద్ర ప్రజాపనుల విభాగం) సిబ్బందికి కూడా ఆ గది అందుబాటులో ఉంటుంది’’ అని జస్టిస్ వర్మ తనకు చెప్పినట్టు జస్టిస్ ఉపాధ్యాయ తన నివేదికలో వెల్లడించారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ తనకు వాట్సాప్ ద్వారా షేర్ చేసిన ఫొటోలు, వీడియోలను (సగం కాలిన నోట్ల కట్టల తాలూకూ) చూపించగ, అదంతా తనపై జరుగుతున్న కుట్రగా జస్టిస్ వర్మ పేర్కొన్నారని వివరించారు. 20వ తేదీన ఆ ఫొటోలు, వీడియోలను సీజేఐకి పంపినట్టు వెల్లడించారు. అందుబాటులో ఉన్న వివరాలు, జస్టిస్ వర్మ స్పందన, పోలీసు కమిషనర్ ఇచ్చిన నివేదిక, తాను జరిపిన విచారణ ప్రకారం ఆ గదిలోకి పనివారు, తోటపనివారు, కుటుంబసభ్యులు, సీపీడబ్ల్యూడీ సిబ్బందికి తప్ప బయటివారెవరికీ ప్రవేశం లేదని తేల్చిచెప్పారు.
ప్రమాదం జరిగిన రోజు జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేశారని.. అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయలేదని జస్టిస్ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. అగ్నిప్రమాదం జరిగిన స్టోర్ రూమ్లోకి ఎవరో బలవంతంగా ప్రవేశించిన ఆనవాళ్లేవీ లేవని.. జస్టిస్ వర్మ కుటుంసభ్యులకు, పనివారికి మాత్రమే దాంట్లోకి ప్రవేశం ఉందని తేల్చిచెప్పారు.
కాగా, తన ఇంట్లో పెద్దయెత్తున కాలిన నోట్లు లభ్యమయ్యాయని వస్తున్న ఆరోపణలను జస్టిస్ వర్మ కొట్టివేశారు. ఈ మేరకు కేసు విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్కు లేఖ రాస్తూ తన ఇంట్లో అగ్నిప్రమాదం తర్వాత తన ఇంటి ప్రాంగణం నుంచి కానీ, స్టోర్ రూమ్లో నుంచి కాని ఎలాంటి కాలిన నోట్లను అధికారులు స్వాధీనం చేసుకోలేదని చెప్పారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత