జస్టిస్‌ వర్మపై సుప్రీం అంతర్గత విచారణ

జస్టిస్‌ వర్మపై సుప్రీం అంతర్గత విచారణ
అగ్నిప్రమాదంతో వెలుగులోకి వచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఉదంతంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా విచారణకు ఆదేశించారు. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ్‌ శుక్రవారం ఇచ్చిన అంతర్గత విచారణ నివేదిక మేరకు శనివారం త్రిసభ్య కమిటీని నియమించారు. 
 
సమగ్ర విచారణ జరపనున్న ఈ కమిటీలో పంజాబ్‌-హరియాణా హైకోర్టు సీజే జస్టిస్‌ శీల్‌నాగు, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జీఎస్‌ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అను శివరామన్‌ ఉన్నారు. వర్మ అంశంపై సుప్రీంకోర్టు ఓ ప్రకటనను విడుదల చేస్తూ ‘‘జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి’’ అని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు సీజే ఇచ్చిన నివేదిక, జస్టిస్‌ వర్మ వివరణ, ఫొటోలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు తెలిపింది.

సుప్రీంకోర్టు ఇలా ఆధారాలను అప్‌లోడ్‌ చేయడం మొదటిసారి కాగా, పూర్తి పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో వివరించింది. జస్టిస్‌ వర్మ వివరణలో తాను ఆ క్లిప్పింగ్‌లను చూసి, షాక్‌కు గురైనట్లు తెలిపారు. ‘‘ఆ దృశ్యాలు మా ఇంటి వద్ద జరిగిన ప్రమాదానివి కాదు. నాపై కుట్ర జరిగినట్లు స్పష్టమవుతోంది’’ అని వివరణ ఇచ్చారు. 

కాగా ఈ ఉదంతం వెలుగులోకి రాగానే సీజేఐ కొలీజియం భేటీని ఏర్పాటు చేయడానికి ఓ వీడియో క్లిప్పింగ్‌ ప్రధాన కారణం అని తెలుస్తోంది. ఈనెల 14న వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వీడియోను చిత్రీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ క్లిప్పింగ్‌ను ఉన్నతాధికారులకు పంపగా.. వారు సీజేఐకి చేరవేశారు. ఆ క్లిప్పింగ్‌ ఆధారంగానే వర్మ బదిలీ, అంతర్గత విచారణకు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవంక, జస్టిస్‌ వర్మ ఇంట్లో ఎలాంటి నోట్లకట్టలు లభించలేదని తాను ప్రకటన చేసినట్లు పలు మీడియాల్లో కథనాలు వచ్చాయని, అవి అసత్యమని ఢిల్లీ అగ్నిమాపక విభాగం డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ గర్గ్‌ స్పష్టంచేశారు. తాను అలా చెప్పలేదని వివరించారు. ఇలా ఉండగా, గతంలో 2018లోనే ఓ ఆర్థిక వ్యవహారంలో వర్మ నిందితుడిగా ఉండగా గత ఏడాది ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఉన్న సింభోలీ షుగర్‌ మిల్స్‌కు వర్మ 2012 వరకు నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించేవారు. పరికరాలు, పనిముట్లు అందించే ఉద్దేశంతో చెరుకు రైతులకు నగదు పంపిణీ చేస్తామని పేర్కొంటూ ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ వద్ద ఆ మిల్లు రూ.97.85 కోట్ల రుణం తీసుకుంది. ఆ మొత్తాన్ని రైతులకు ఇవ్వకుండా ఇతర ఖాతాలకు బదిలీ చేసింది.