
తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి విమర్శించారు. అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు.
పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఖాతంలోకి నెట్టేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసిందని ఆయన చురకలు వేశారు. గతేడాది బడ్జెట్ పెట్టినపుడు తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారని, మరి 15 నెలల పాటు పాలించిన తర్వాత కూడా ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా, కేటాయింపులు, ఆచరణలో శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైందని కిషన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. 2024-.25 బడ్జెట్లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపించారు, కానీ సవరించిన అంచనాల్లో రూ.5 వేల కోట్లు తగ్గించి రూ.53,665 కోట్లుగా వెల్లడించారని తెలిపారు. అంటే దాదాపు 8.5 శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయని, దీనికి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని సూచించారు.
2025-.26కి గాను రూ.59,704 కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందులో లెక్కలు పెంచి ఎంత రాశారో అర్థం కావడం లేదని కిషన్రెడ్డి తెలిపారు. 2024-.25లో ఎక్సైజ్ టాక్స్ ద్వారా రూ.25,617 కోట్ల అంచనాలు ప్రకటించిన సర్కారుకు ఈసారి బడ్జెట్లో రూ.27,623 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా రావొచ్చని అంచనా వేస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేసి ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచన స్పష్టంగా కనబడుతోందని ఆరోపించారు. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తప్పించుకుటోందని విమర్శించారు.
More Stories
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం
తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వాఘా సరిహద్దు దాటాలి
కాళేశ్వరంలో డిజైన్లు, నాణ్యతలో ప్రమాణాలకు తిలోదకాలు