నటి రన్యారావుకు బెయిల్ నిరాకరణ

నటి రన్యారావుకు బెయిల్ నిరాకరణ

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కన్నడ నటి రన్యారావుకు చుక్కెదురైంది. ఆమె బెయిల్ అభ్యర్థనను ఆర్థిక నేరాల విచారణ కోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. ఈ కేసులో రెండో నిందితుడైన తరుణ్ కొండూరు బెయిల్ అభ్యర్థను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు విచారించనుంది.

మార్చి 3న దుబాయ్‌ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యారావును డీఐర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి రూ.12.56 కోట్ల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిలు కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగగా, ఆమెకు బెయిల్ ఇవ్వరాదని కోర్టును డీఆర్ఐ కోరింది. 

బెయిలుపై ఆమెను విడుదల చేస్తే ప్రస్తుతం జరుగుతున్న విచారణకు అవరోధం కలుగుతుందని, సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని వాదించింది. దీనికి ముందు, డీఆర్ఐ విచారణలో తన పట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించారని, మానసికంగా వేధించారని, బెదిరించారని రెన్యారావు ఇటీవల కోర్టు విచారణలో ఆరోపించింది. 

అయితే ఈ ఆరోపణలను డీఆర్ఐ తోసిపుచ్చింది. రన్యారావును అదుపులోకి తీసుకున్నప్పుడు, విచారణ జరిపినప్పడు రికార్డు చేశామని, చట్టబద్ధంగా, గౌరవప్రదంగా విచారణ జరిపామని తెలిపింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల పాత్ర గుర్తించే దిశగా సిబీఐ దర్యాప్తు జరుపుతుండగా, మనీలాండరింగ్ కోణం నుంచి ఈడీ రంగంలోకి దిగి బెంగళూరు సహా పలు చోట్ల దాడులు చేపట్టింది. 

మరోవైపు, రెన్యారావు వ్యవహారంలో ఆమె సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రారావు పాత్ర ఏమేరకు ఉందనే దానిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సీనియర్ అధికారిని నియమించింది.