తమిళనాడు బడ్జెట్‌లో అధికారిక రూపాయి చిహ్నం తొలగింపు

తమిళనాడు బడ్జెట్‌లో అధికారిక రూపాయి చిహ్నం తొలగింపు
 
* తారస్థాయికి చేరిన హిందీ వ్యతిరేక చర్యలు
 
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ కోసం తయారుచేసిన లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి ఆ స్థానంలో తమిళ పదం రూబాయిని చేర్చి జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ) వ్యతిరేకించే విషయంలో తగ్గేది లేదని కేంద్రానికి మరోసారి స్పష్టం చేయడం రాజకీయ దుమారం రేపింది. రాష్ట్ర అసెంబ్లీలో మార్చి 14న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించిన టీజర్‌ను ముఖ్యమంత్రి ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. 
 
సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తమిళనాడు సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ బడ్జెట్‌ని రూపొందించినట్టు స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.
ద్రవిడియన్‌ మోడల్‌, టీఎన్‌బడ్జెట్‌ 2025 హ్యాష్‌ట్యాగులతో విడుదల చేసిన బడ్జెట్‌ లోగోలో హిందీ అక్షరం ఆర్‌ స్ఫూర్తితో రూపొందిన అధికారిక రూపాయి చిహ్నం మాయమైంది. ఆ స్థానంలో తమిళ పదం రూబాయికి చిహ్నమైన రూ అనే తమిళ అక్షరం దర్శనమిచ్చింది. 
 
గత రెండు వార్షిక బడ్జెట్‌లలో మాత్రం అధికారిక రూపాయి చిహ్నమే లోగోలలో ఉండడం విశేషం. 2023-24 బడ్జెట్‌ లోగోలో కూడా అధికారిక రూపాయి చిహ్నమే ఉంది. దీన్ని ఐఐటీ-గువాహటి ప్రొఫెసర్‌ డిజైన్‌ చేశారు. ఆయన డీఎంకే నాయకుడు కుమారుడు కావడం గమనార్హం.  జాతీయ కరెన్సీ చిహ్నాన్ని ఒక రాష్ట్రం తిరస్కరించడం చరిత్రలో ఇదే మొదటిసారి. 
 
ఎన్‌ఈపీ ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, అధికారిక రూపాయి చిహ్నాన్ని రాష్ట్రం తిరస్కరించడంగా దీన్ని భావించరాదని డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్‌ పేర్కొన్నారు. తమిళ అక్షరం రూ ఉపయోగించడం ద్వారా తమిళ భాషను ప్రోత్సహించే ప్రయత్నంగా చూడాలని ఆయన తెలిపారు.కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు ప్రభుత్వం రూపాయి చిహ్నాన్ని “ప్రమాదకరమైన మనస్తత్వం”గా అభివర్ణిస్తూ, డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యను తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రాంతీయ గర్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహిస్తుందని ఆమె హెచ్చరించారు.

“రూపాయి చిహ్నాన్ని డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్. ధర్మలింగం కుమారుడు డి. ఉదయ కుమార్ రూపొందించారు. ఇప్పుడు దానిని తుడిచివేయడం ద్వారా, డీఎంకే జాతీయ చిహ్నాన్ని తిరస్కరించడమే కాకుండా, తమిళ యువకుడి సృజనాత్మక సహకారాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తోంది” అని ఆమె ధ్వజమెత్తారు.

“ఇది కేవలం ప్రతీకవాదం కంటే ఎక్కువ – ఇది భారతీయ ఐక్యతను బలహీనపరిచే, ప్రాంతీయ గర్వం పేరుతో వేర్పాటు వాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తుంది. భాష, ప్రాంతీయ దురభిమానానికి పూర్తిగా నివారించదగిన ఉదాహరణ” అని సీతారామన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారిక రూపాయి చిహ్నాన్ని మార్చాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మూర్ఖత్వానికి పరాకాష్టగా అన్నామలై అభివర్ణించారు. యావద్దేశం ముందు తమిళ ప్రజలను నవ్వులపాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్‌ స్పందిస్తూ ముఖ్యమంత్రి మూర్ఖపు చర్యకు పాల్పడరాదని, రాష్ట్ర హక్కుల పేరిట ప్రజలను రెచ్చగొట్టరాదని చెప్పారు. రూపాయి చిహ్నాన్ని మార్చినందుకు స్టాలిన్‌పై బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ మండిపడ్డారు.