కన్హా నేషనల్ పార్కులో నక్సల్ కాల్చివేత

కన్హా నేషనల్ పార్కులో నక్సల్ కాల్చివేత

మధ్యప్రదేశ్‌ లోని కన్హా నేషనల్ పార్కులో మంగళవారంనాడు పోలీసులు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సల్ హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 నుంచి 20 మంది నక్సల్స్ పాల్గొన్నట్టు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నారని, ఈ క్రమంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. 

సుమారు 20 మంది వరకూ నక్సల్స్ ఇందులో పాల్గొన్నట్టు చెప్పారు. ఒక నక్సల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, నక్సల్స్ మద్దతుదారులు ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు మండ్లా ఎస్‌పీ రజత్ సక్లేచా తెలిపారు.

టైగర్ రిజర్వ్‌గా, టూరిస్ట్ ప్రాంతంగా మంచి పేరున్న కన్హా నేషనల్ పార్కులో ఇటీవల కాలంలో మావోయిస్టుల ఉనికి పెరుగుతుంది. విశాలమైన పార్కు, దట్టమైన అడవులు ఉండటంతో మావోయిస్టులు తలదాచుకునేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నట్టు చెబుతున్నారు. దీంతో వారిని గాలించి పట్టుకోవడం భద్రతా బలగాలకు ఒక సవాలుగా మారుతుంది. 

సందర్శకుల భద్రతతో పాటు పార్క్‌లో వన్యప్రాణుల సంరక్షణ అధికారులకు కీలకంగా మారుతోంది. నక్సల్స్ రహిత రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు మఖ్యమంత్రి మోహన్ యాదవ్ చర్యలు తీసుకుంటున్నారు. 2026 నాటికి అన్ని రాష్ట్రాలను నక్సల్స్‌ బెడద నుంచి విముక్తి చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు, పోలీసులు ముమ్మర గాలింపులు సాగిస్తున్నారు.