
భారత క్రికెట్ జట్టు12 ఏండ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్నది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను మట్టికరిపించి ముచ్చటగా మూడోసారి ‘చాంపియన్స్’గా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. పటాకుల మోతలు, విజయోత్సవ ర్యాలీలతో ప్రజలు సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ క్రమంలో పలుచోట్ల అవాంఛనీయ ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా మోవ్ పట్టణంలో కొందరు యువకులు టీమ్ఇండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని జామా మసీద్ వద్దకు ర్యాలీ చేరుకున్నది. అయితే కొందరు వ్యక్తులు ర్యాలీపై రాళ్లతో దాడిచేశారు.
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. పరస్పరం రాళ్లతో దాడిచేసుకున్నారు. పలు దుకాణాలను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నదని ఇండో జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
ఇరు వర్గాల ఘర్షణతో మోవ్లో ఉద్రిక్త పరిస్థితులు నెకొన్నాయని ఇండరో రూరల్ ఎస్పీ హితికా వాసల్ చెప్పారు. టీమ్ఇండియా విజయం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తుండగా ఘర్షణ నెలకొన్నదని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఊహాగానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అసత్య వార్తలను నమ్మకూడదని సూచించారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులతపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరస్పర దాడిలో ముగ్గురు గాయపడ్డారని చెప్పారు.
More Stories
అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం