
* బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బంధీలుగా 400 మంది!
పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వేర్పాటువాద ఉగ్రవాదులు మంగళవారం దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు. పాక్ నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుంచి నుంచి ఖైబర్ పంఖ్తుఖ్వాలోని పెషావర్కు వెళ్తున్న రైలుపై కాల్పులు జరిపి రైలును ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రయాణికులతో పాటు పలువురు భద్రతా సంస్థలకు చెందిన వారిని బంధీలుగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇందులో పాకిస్తాన్ సైనికులు, పోలీసులు, యాంటీ-టెర్రరిజం, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్కి చెందిన సిబ్బంది ఉన్నారు. ఆరుగురు సైనిక సిబ్బందిని హతమార్చినట్లు తెలుస్తున్నది. వీరంతా సెలవులపై పంజాబ్కు ప్రయాణిస్తున్న సమయంలో వారిని బంధీలుగా చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
ఈ ఘటన నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. పాకిస్తాన్ మీడియా ప్రకారం కొంత మంది సాయుధ వ్యక్తులు క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను పెహ్రో కున్రి -గడ్లార్ మధ్య సొరంగం సమీపంలో నిలిపివేశారు. తొమ్మిది కోచ్ల రైలులో 400 మంది ప్రయాణికులు ఉన్నారు.
రైలు హైజాక్ గురించి సమాచారం అందుకున్న తర్వాత బలూచిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. సీబీ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితి విధించినట్లు బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ తెలిపారు. అంబులెన్స్లు, భద్రతా దళాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. రైల్వేలు కూడా సహాయక చర్యలను ప్రారంభించాయని షాహిద్ రిండ్ పేర్కొన్నారు.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ) పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్నది. పాకిస్తాన్తో పాటు చైనాపై దాడులకు పాల్పడనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం బలూచ్ నేషనల్ ఆర్మీ అనే ఏకీకృత సంస్థను ప్రకటించిన కొద్దిరోజులకే.. హైజాక్ ఘటన చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా తిరుగుబాటుతో బలూచిస్తాన్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. మార్చి 5న ఖుజ్దార్ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఆపరేషన్ను బిఎల్ఏ మజీద్ బ్రిగేడ్ ఫతే స్క్వాడ్, ఎస్ టి ఓ ఎస్ నిర్వహిస్తున్నాయని బిఎల్ఏ ప్రతినిధి తెలిపారు. జాఫర్ ఎక్స్ప్రెస్ పాకిస్తాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుండి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్కు ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు నివేదించబడింది. బోలాన్లోని ధదర్లోని మష్కాఫ్లో తమ యోధులు “జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్” నిర్వహించారని ఆ ప్రకటన తెలిపింది.
“మా స్వాతంత్ర్య సమరయోధులు రైల్వే ట్రాక్ను పేల్చివేశారు, జాఫర్ ఎక్స్ప్రెస్ను ఆపవలసి వచ్చింది. యోధులు రైలును త్వరగా నియంత్రించారు, ప్రయాణికులందరినీ బందీలుగా ఉంచారు” అని ఆ బృందం ఒక ప్రకటనలో పేర్కొంది. బిఎల్ఏ గ్రూప్ “ఆక్రమిత దళాలు ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వందలాది మంది బందీలను ఉరితీస్తారు. ఈ రక్తపాతానికి బాధ్యత ఆక్రమిత దళాలపైనే ఉంటుంది” అంటూ కఠినమైన హెచ్చరిక జారీ చేసింది.
బిఎల్ఏ ఉగ్రవాదులు ఒక ప్రకటనలో మహిళలు, పిల్లలు, బలూచ్ ప్రయాణికులను విడుదల చేశామని, మిగిలిన బందీలందరూ పాకిస్తాన్ దళాలకు సేవ చేస్తున్నారని నిర్ధారించుకున్నామని పేర్కొన్నారు. అయితే, బలూచ్ అధికారులు లేదా రైల్వే అధికారులు ప్రాణనష్టం, బందీల స్థితిని ఇంకా నిర్ధారించలేదు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత