టీచర్స్ ఎంఎల్‌సిలుగా శ్రీపాల్, కొమురయ్య విజయం

టీచర్స్ ఎంఎల్‌సిలుగా శ్రీపాల్, కొమురయ్య విజయం

తెలంగాణాలో ఉపాధ్యాయ కోటా ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నల్గొండ -ఖమ్మం -వరంగల్ ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ టీచర్ ఎంఎల్‌సిగా బిజెపి అభ్యర్థి మల్కకొమురయ్య గెలుపొందారు. 

నల్గొండలోని వేర్‌హౌసింగ్ గోదాములో జరిగిన కౌంటింగ్‌లో శ్రీపాల్ రెడ్డి తన ప్రత్యర్థులైన అలుగుబెల్లి నర్సిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిపై విజయం సా ధించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో అధికారులు ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎంఎల్‌సి నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. 

వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 24,139 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 9 గంటలకు ముగిసింది. మొత్తం 25 కౌంటింగ్ నిర్వహించారు. 

అదేవిధంగా కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా మల్క కొమురయ్య విజయం సాధించారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరిగింది. ఈ స్థానం నుంచి రాజకీయ పార్టీల్లో బీజేపీ మాత్రమే అభ్యర్థిని పోటీలో నిలపగా.. మిగతా పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 27,088 మంది ఓటర్లు ఉండగా, 25,041 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వీరిలో 73 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలైన ఓట్లలో 897 ఓట్లు చెల్లకుండా పోయాయి. 24,144 ఓట్లు చెల్లుబాటు కాగా, అభ్యర్థి గెలుపొందడానికి 12,081 ఓట్లను కోటా ఓటుగా నిర్ధారించారు. కాగా, బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే కోటా ఓటుకు మించి ఓట్లు సాధించి గెలుపొందారు.

కొమురయ్యకు 12,959 ఓట్లు రాగా ఆయన సమీప పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డికి 7182 ఓట్లు వచ్చాయి. అశోక్‌కుమార్‌కు 2,621 ఓట్లతో మూడో స్థానంలో, సిటింగ్‌ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి 428ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.  మరోవైపు కరీంనగర్ -మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం కౌంటింగ్ కొనసాగుతోంది. మంగళవారం వరకు ఫలితం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

పట్టభద్రుల స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. మొత్తం 2,50,106ఓట్లు పోలయ్యాయి. వీటి నుంచి చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ సోమవారం రాత్రి వరకూ పూర్తికాలేదు. 25 ఓట్లకు ఒకటి చొప్పున కట్టలు కట్టి, ఆ తర్వాత ఓట్లను లెక్కిస్తారు. కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశముందని, ఆ తర్వాత నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు.