ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు పేషీ మాజీ ఉద్యోగి

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు పేషీ మాజీ ఉద్యోగి

స్థిరాస్తి వ్యాపారి చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. చక్రధర్‌గౌడ్‌ ఫోన్‌ట్యాప్‌ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పేషీ మాజీ ఉద్యోగి వంశీకృష్ణను, అతనికి సహకరించిన సంతోష్‌కుమార్, పరశురాములును పోలీసులు అరెస్ట్ చేశారు. 

దర్యాప్తులో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే హరీశ్‌రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావుపై కేసు నమోదు చేశారు. మరోవైపు శుక్రవారం ఫోన్‌ట్యాపింగ్‌ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ కేసులో నమోదైన వారిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించాలని పోలీసులకు న్యాయస్థానం స్పష్టం చేసింది.

కాగా విచారణను న్యాయవాదిని అనుమతించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. పంజాగుట్ట పోలీసులు తనను ఎప్పుడు పడితే అప్పుడు విచారణకు పిలుస్తున్నారని ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వంశీకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ముందస్తు సమాచారం లేకుండా పిటిషినర్​ను తీసుకెళ్తున్నారని, రాత్రి వరకు ఉంచుకుని పంపిస్తున్నారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్‌ను నిర్దిష్ట సమయంలోనే విచారణకు పిలవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.