ఇవిఎంల నుండి డేటాను తొలగించొద్దు.. రీలోడ్‌ చేయొద్దు

ఇవిఎంల నుండి డేటాను తొలగించొద్దు.. రీలోడ్‌ చేయొద్దు
న్నికలు ముగిసిన వెంటనే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల నుండి సమాచారాన్ని తొలగించడానికి ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారో తెలియచేయాల్సిందిగా భారత ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం కోరింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఇవిఎంల్లోని మెమెరీ లేదా మైక్రో కంట్రోలర్లు, పార్టీ చిహ్నాల లోడింగ్‌ యూనిట్‌ (ఎస్‌ఎల్‌యు)లను దగ్ధం చేశారా? లేదా? నిర్ధారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. 
 
ఈ అంశంపై 15 రోజుల్లోగా స్పందించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. వెరిఫికేషన్‌ క్రమంలో డేటాను తుడిచివేయడం లేదా రీ లోడ్‌ చేయడం వంటి చర్యలకు దూరంగా వుండాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపంకర్‌ దత్తాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 3వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో విచారణకు వాయిదా వేసింది. 
 
అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. పాత కాగితపు బ్యాలెట్‌ పద్ధతికే తిరిగి మళ్లాలంటూ వచ్చిన డిమాండ్‌ను గతేగాది ఏప్రిల్‌ 26న సుప్రీంకోర్టు తిరస్కరించింన సంగతి విదితమే. పోలింగ్‌ పరికరాలన్నీ కూడా సురక్షితంగా వుంటాయని, పోలింగగ్‌ కేంద్రాల స్వాధీనాన్ని, బోగస్‌ ఓటింగ్‌ను రద్దు చేస్తాయని పేర్కొంది. 
 
అయితే ఓడిపోయిన అభ్యర్థులు కావాలనుకుంటే ఇసికి ఫీజు చెల్లించి మైక్రో చిప్‌లను పరిశీలించుకోవచ్చునని అనుమతించింది. సింబల్‌ లోడింగ్‌ యూనిట్లకు సీల్‌ వేయాలని వాటిని ఒక కంటైనర్‌లో భద్రతపర్చి స్ట్రాంగ్‌ రూమ్‌లో పరిరక్షించాలని గతేడాది మే 1న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు వెలువడిన 45 రోజుల వరకు ఇవిఎంలను భద్రపరచాలని నిర్దేశించింది. అయితే ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇసి పద్ధతుల్లేవంటూ ఎడిఆర్‌ తన తాజా పిటిషన్‌లో ఫిర్యాదు చేసింది.