అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది

అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది

* ఢిల్లీ సచివాలయానికి తాళం

ఢిల్లీలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపు ఖాయం చేసుకోవడాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ  ప్రజల శక్తి అత్యున్నతమని తెలిపారు. “అభివృద్ధి గెలిచింది, సుపరిపాలన గెలిచింది. బిజెపికి చారిత్రాత్మక విజయాన్ని అందించినందుకు ఢిల్లీ లోని నా సోదరసోదరీమణులందరికీ నా వందనం అభినందనలు!” అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

“నాకు ఇచ్చిన అపారమైన ఆశీర్వాదాలు, ప్రేమకు నేను మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞుడను. ఢిల్లీ అభివృద్ధిని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదలుకోం. ఇది మా హామీ. దీనితో పాటు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించడంలో ఢిల్లీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మేము భావిస్తున్నాం” అని ప్రధాని తెలిపారు. 

“ఈ తీర్పు కోసం పగలు రాత్రి పనిచేసిన నా బీజేపీ కార్యకర్తలందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు మేము మా ఢిల్లీ వాసులకు మరింత అంకితభావంతో సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటాము” అని ట్వీట్ చేశారు.

దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కమల దళం చేతికి చిక్కింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సచివాలయ ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేశారు. సచివాలయం నుంచి ఏ ఒక్క ఫైల్, రికార్డు, హార్డ్ డ్రైవ్ బయటకు వెళ్లకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

పదేళ్లుగా ఢిల్లీలో అధికారం చెలాయించిన ఆప్‌పై బీజేపీ కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను జారీ చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించి ఒక్క ఫైల్‌ కూడా బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. గతంలో పలు రాష్ట్రాల్లో అధికారం చేతులు మారినపుడు ఫైళ్లు చోరీకి గురవుతూ ఉంటాయి. ఢిల్లీలో అలా జరగకూడదని బీజేపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ’ఎక్స్’ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ‘పదే పదే తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టలేరని ఢిల్లీ ప్రజలు చెప్పారు. వారి ఓట్లతో, ప్రజలు మురికి యమునా, మురికి తాగునీరు, విరిగిన రోడ్లు, పొంగిపొర్లుతున్న మురుగు కాలువలు, ప్రతి వీధిలో తెరిచిన మద్యం దుకాణాలపై స్పందించారు’ అంటూ ఆప్ పై ధ్వజమెత్తారు.

“ఢిల్లీలో ఈ మహా విజయం కోసం అహోరాత్రులు శ్రమించిన వారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ లకు నా హృదయపూర్వక అభినందనలు. మహిళల పట్ల గౌరవం, అనధికార కాలనీ నివాసితుల ఆత్మగౌరవం, స్వయం ఉపాధికి అపారమైన అవకాశాలు ఉన్న ఢిల్లీలో.. ఇక ప్రధాన నరేంద్ర మోదీ  నాయకత్వంలో ఢిల్లీ ఆదర్శవంతమైన రాజధానిగా మారనుంది” అంటూ ట్వీట్ చేశారు.

 ఇలా ఉండగా,  అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజా తీర్పును అంగీకరిస్తాం అని తెలిపారు. అధికారంలోకి రానున్న బిజెపికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశమిచ్చారు. 
 
“ఈ ఎన్నికల్లో ప్రజాతీర్పును మేము వినమ్రంగా అంగీకరిస్తున్నాం. ఈ సందర్బంగా అధికారంలోకి రానున్న బిజెపికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఓటు వేసిన ప్రజలకు వారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను. మేము అధికారంలో ఉన్న పదేళ్లలో ఆరోగ్యం, విద్య మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో ఎన్నో పనులు చేశాం. అయితే ఇప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి సేవ చేస్తూనే ఉంటాం. మేము అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు సేవ చేసే మాధ్యమంగా భావించే రాజకీయాల్లోకి వచ్చాం” అని ఆయన వీడియో సందేశంలో పేర్కొన్నారు.