ఢిల్లీలో ఆప్‌ ఓటమికి కేజ్రీవాల్‌ కారణం

ఢిల్లీలో ఆప్‌ ఓటమికి కేజ్రీవాల్‌ కారణం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం దిశగా దూసుకెళుతోంది. 70 స్థానాల్లో బిజెపి ఇప్పటికే 48  స్థానాల్లో ముందంజలో ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్న ఆప్‌ కేవలం 22 సీట్లకే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఓటమికి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కారణమని సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

అలాగే ఆమ్‌ఆద్మీ పార్టీ లిక్కర్‌ అండ్‌ మనీ కేసు వివాదంలో ఆప్‌ పార్టీ చిక్కుకోవడం కూడా ఓటమికి కారణమేనని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా ఆప్‌నే ఢిల్లీ అధికారంలో ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అభ్యర్థి వ్యక్తిత్వం, వారి ఆలోచనలు గెలుపుపై ప్రభావం చూపుతాయ’ అని స్పష్టం చేశారు. 

“అలాంటివారే ఎన్నికల్లో పోటీ చేస్తే వారికెలాంటి ఢోకా ఉండదని గెలిచే అవకాశం ఉంటుందని చాలా కాలంగా చెబుతున్నాను. కానీ నా మాటల్ని ఆప్‌ నేతలు వినలేదు. ప్రధానంగా లిక్కర్‌ అండ్‌ మనీ కేసులో చిక్కుకోవడం వల్ల ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇమేజ్‌ దెబ్బతిన్నది. అందుకే ఆప్‌ నేతలకి ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వస్తున్నాయి. ఓటమికి కారణమైంది” అని ఆయన తెలిపారు. 

“ముఖ్యంగా లిక్కర్‌ కేసుకి సంబంధించి కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ బిజెపి నేతల ఆరోపణలపై అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడిన తీరు ప్రజలు గమనించారు. ఆయనపై ఆరోపణలు వస్తే నిర్దోషినని తాను నిరూపించుకోవాలి. ఎప్పటికీ నిజం.. నిజమే అవుతుంది. ఇలాంటి విషయాలపై ఓసారి మీటింగ్‌ జరిగినప్పుడు జరిగిన చర్చల సందర్బంగా నేను పార్టీలో భాగం కానని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నేను పార్టీకి దూరంగా ఉన్నాను” అని అన్నా హజారే వివరించారు.