హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు

హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు
* ప్రియాంక్ ఖర్గే బహిరంగ లేఖపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంస్థాగత హోదాపై స్పష్టత కోరుతూ కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖను ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ కొట్టిపాశారు. ఇది కేవలం రాజకీయపరమైన అంశం అని, దీనికి స్పందించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. 
 
“నేను దీనికి స్పందించాల్సిన అవసరం లేదు. నమోదు కానివి ఎన్నో ఉన్నాయి. పైగా మేము ఏమీ రహస్యంగా వ్యవహరించడం లేదు. మేము బహిరంగంగానే పనిచేస్తున్నాము. ప్రజలను ఆహ్వానించి సంఘ్ గురించి వారికి వివరిస్తున్నాము. ఇవి రాజకీయాలు, ఇలాంటి ఎత్తుగడలు వేయడం సహజం. మాకు ఇవన్నీ అలవాటే. సంఘ్ ఏర్పడిన 10-15 ఏళ్ల నుంచే మేము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాము. మాకు ఇవన్నీ అలవాటే…” అని ఖర్గే వ్యాఖ్యలపై భగవత్ స్పందించారు.
 
ఆర్‌ఎస్‌ఎస్ పారదర్శకతను, రాజ్యాంగపరమైన జవాబుదారీతనాన్ని పాటించాలని కోరుతూ, ఆ సంస్థ తనను తాను నమోదు చేసుకోవాలని, చట్టపరమైన హోదాను స్పష్టం చేయాలని, అలాగే నిధుల వనరులు, ఆదాయం, వ్యయం, ఆస్తుల వివరాలను వెల్లడించాలని కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే సోమవారం డిమాండ్ చేసిన నేపథ్యంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
అధికారిక నమోదు లేకుండానే అనేక సంస్థలు, సంప్రదాయాలు కొనసాగుతున్నాయని భగవత్ గుర్తు చేశారు. ఆయన ఇలా పేర్కొన్నారు: “హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు. నమోదు కానివి ఎన్నో ఉన్నాయి… ప్రభుత్వం మమ్మల్ని రెండుసార్లు నిషేధించింది; ఒకసారి కోర్టు ఆదేశాల ద్వారా, మరోసారి సత్యాగ్రహం ద్వారా ఆ నిషేధాలు తొలగిపోయాయి. కాబట్టి ఆర్‌ఎస్‌ఎస్ ఉనికిలో ఉందని ప్రభుత్వానికి తెలుసు. వారు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారంటే, దాని ఉనికిని గుర్తించినట్టే కదా…” 
 
ఆయన ఇంకా ఇలా తెలిపారు: “ఇదంతా రాజకీయమే, ఇందులో తీవ్రత ఏమీ లేదు. ఒకవైపు సంఘ్ పనికి ఆటంకం కలిగించాలని, మరోవైపు ప్రజల మనసుల్లో అనుమానాలు రేకెత్తించాలని వారు కోరుకుంటున్నారు. కానీ అది ఇక సాధ్యం కాదు, ఎందుకంటే ప్రజలకు మా గురించి తెలుసు.”  ఆర్‌ఎస్‌ఎస్ రహస్యంగా పనిచేస్తుందన్న ఆరోపణలను కూడా భగవత్ తోసిపుచ్చారు.
తమ కార్యకలాపాలు బహిరంగంగానే జరుగుతాయని, సమాజానికి కనిపిస్తూనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. “మేము రహస్యంగా పనిచేస్తున్నామని వారు అంటారు. మా కార్యకర్తలు అన్ని ప్రాంతాల్లోనూ నివసిస్తుంటారు. ప్రజలు వారిని ప్రతిరోజూ చూస్తుంటారు. మా శాఖలు బహిరంగ మైదానాల్లో జరుగుతాయి. ప్రజలు వాటిని ప్రతిరోజూ చూస్తుంటారు. మాకు బహిరంగ కార్యక్రమాలు కూడా ఉంటాయి…” అని తెలిపారు.
 
ఆర్‌ఎస్‌ఎస్ తన ఉనికిలో 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, దాని సంస్థాగత హోదాపై స్పష్టత కోరుతూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మోహన్ భగవత్‌కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో భగవత్‌కు రాసిన తన లేఖను పోస్ట్ చేస్తూ, ప్రియాంక్ ఖర్గే ఇలా పేర్కొన్నారు: భారతదేశంలోనూ, విదేశాలలోనూ 60,000కు పైగా శాఖలు, కోట్లాది స్వయంసేవకులు ఉన్నామని చెప్పుకునే ఒక సంస్థ పారదర్శకత, జవాబుదారీతనం, రాజ్యాంగ అనుగుణ్యతను పాటించాలి”. 
 
ఆర్‌ఎస్‌ఎస్ తన శత వార్షికోత్సవాన్ని కేవలం ఒక మైలురాయి వేడుకగా కాకుండా, రాజ్యాంగపరమైన పునరాలోచనకు ఒక అవకాశంగా భావించాలని కోరుతూ, ప్రియాంక్ ఖర్గే ఇలా తెలిపారు:”తన 100వ సంవత్సరంలో భారతదేశానికి అది ఇవ్వగల ఉత్తమ నివాళి ఏమిటంటే, తనను తాను నమోదు చేసుకోవడం, తన కార్యకలాపాలు, ఆర్థిక వివరాలను బహిర్గతం చేయడం, వర్తించే అన్ని పన్నులు చెల్లించడం, భారత చట్ట పరిధిలో పారదర్శకమైన, జవాబుదారీ సంస్థగా పనిచేయడం.” 
 
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడైన ప్రియాంక్ ఖర్గే, ఆర్‌ఎస్‌ఎస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన అఖిల్ భారతీయ ప్రతినిధి సభ 2025–26 కర్ణాటక నివేదికను కూడా ప్రస్తావించారు. ఆ నివేదికను ఉటంకిస్తూ, ఆ సంస్థ కర్ణాటక వ్యాప్తంగా 4,127 రోజువారీ శాఖలు, 1,389 వారపు మిలన్లు, 60 నెలవారీ మండలిలను నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు.