వరల్డ్ ఆడియో విజువల్ సదస్సుపై ప్రధాని మోదీ భేటీ

వరల్డ్ ఆడియో విజువల్ సదస్సుపై ప్రధాని మోదీ భేటీ
భారత్‌ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారత సినిమాలు రికార్డులను సృష్టించడంతోపాటు అవార్డులను దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో  వరల్డ్‌ ఆడియో విజువల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌) ను తొలిసారిగా భారత్‌ లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌) పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని గ్లోబల్‌ క్రియేషన్‌ హబ్‌ గా మార్చే లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రకటించిన వేవ్స్‌ సమ్మిట్‌ 2025 కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని సినీ ప్రముఖులు పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో నిర్వహించే ఈ సదస్సు గురించి సినీ ప్రభుఖులతో ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమమాలిని, దీపికా పద్కొణే, ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగం చేసినందుకు చిరంజీవి ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికపై చిరంజీవి వెల్లడించారు. 
 
“గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈ గౌరవానికి ధన్యవాదాలు. వేవ్స్ సలహా బోర్డులో భాగం కావడం, ఇతర ప్రముఖులతో నా అభిప్రాయాలు పంచుకోవడం ఒక అదృష్టం. మోదీ జ్ఞానసంతానం అయిన వేవ్స్, భారత్‌కు ‘సాఫ్ట్ పవర్’ ను ప్రపంచంలో ఎత్తుకు తీసుకెళ్లే శక్తిగా ఉంటుందని నమ్ముతున్నాను. త్వరలోనే కొత్త ప్రగతికి సిద్ధంగా ఉండండి” అంటూ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.