ఛత్తీస్‌గడ్‌లో మరో నలుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గడ్‌లో మరో నలుగురు మావోలు మృతి
వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. తాజాగా ఛత్తీస్‌గడ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.  ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గురువారం ఉదయం నుంచి మాధ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  త ఐదురోజుల క్రితం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టుల మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. 
 
ఆపరేషన్ కగార్ పేరుతో చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యం మొత్తాన్ని భారీగా భద్రతా బలగాలు నలువైపులా చుట్టుముట్టి వరుసగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా.. అగ్రనేతలు తప్పించుకున్నట్లు బస్తర్ ఐజి పి.సుందర్‌లాల్‌ తెలిపారు.

అలాగే జనవరి 21 గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్ జిల్లాలోని పామేడు, బాసగూడ, ఊసురు గంగ పోలీస్‌స్టేసన్ పరిధిల్లోనే ఎక్కవగా సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది. తెలంగాణ సరిహద్దు సౌత్ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు సుప్రీం కమాండర్‌గా ఉన్న మడవి హిడ్మాతో పాటు తెలంగాణ కార్యదర్శి ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భారీగా సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

తెలంగాణ సరిహద్దులో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణలోకి మావోయిస్టులు రాకుండా ఇక్కడి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. వచ్చే మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన శపథంలో భాగంగా ఆపరేషన్ కగార్ దూకుడు పెంచింది.