ఐసిసి టోర్నీ ఆఫ్ ది టీమ్‌లో గొంగడి త్రిష

ఐసిసి టోర్నీ ఆఫ్ ది టీమ్‌లో గొంగడి త్రిష

భారత్ రెండోసారి అండర్ 19 వరల్డ్ కప్ నెగ్గడంలో కీలక పాత్రపోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు అరుదైన గౌరవం దక్కింది. టైటిల్ పోరుతో భారత విజయంలో గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. సంచలన బ్యాటింగ్‌తో పాటు అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫైనల్లోనూ గొంగడి త్రిష (33 బంతుల్లో 8×4తో 44 నాటౌట్) అదరగొట్టింది. 

బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసింది. అయితే ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసిసి టోర్నీ ఆఫ్ ది టీమ్‌ను ప్రకటించింది. ఈ జట్టులో గొంగడి త్రిషతో పాటు నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. త్రిషతో పాటు జి. కమలిని, ఆయుషీ శుక్లా, వైష్ణవి శర్మ ఈ జట్టుకు ఎంపికయ్యారు.

ఈ టోర్నీలో 11 వికెట్లతో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెకేను సారథిగా ఎంపిక చేసింది. ఈ టోర్నీలో గొం గడి త్రిష 77.25 సగటుతో 309 పరుగులు చేసింది. ఇందులో ఓ అజేయ శతకం కూడా ఉంది. టోర్నీ టాపర్‌గా నిలవడమే కాకుండా బౌలింగ్‌లో 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది. 

మరో భారత ప్లేయర్ జి కమలిని 35.75 సగటుతో 143 పరుగులు చేసింది. ఆయుషి శుక్లా 14 వికెట్లు తీయగా, వైష్ణవి శర్మ 17 వికెట్లు పడగొట్టింది.

టీమ్ వివరాలు
గొంగడి త్రిష, జెమ్మా బోథా, డేవినా పెర్రిన్, జి కమలిని, కావోయిమ్‌హే బ్రే, పూజ మహతో, కైలా రేనెకే, కేటీ జోన్స్, ఆయుషి శుక్లా, చమోడి ప్రబోద, వైష్ణ విశర్మ, న్తాబిసెగ్ నిని

కేవలం 2 సంవత్సరాల వయసులో బ్యాట్ పట్టిన త్రిష , 9 ఏళ్లకే హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఎంపిక అయ్యింది. తర్వాత, అండర్-23 జట్టులో కూడా ఆడింది. ఇప్ప‌టికీ 19 సంవత్సరాల వయస్సులో, స్టార్ క్రికెటర్‌గా మారిన త్రిష, ఇకపై భారత జట్టులో కీలక పాత్ర పోషిస్తుందని అభిమానులు భావిస్తున్నారు
“సుదీర్ఘ కాలం టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలనేది నా ఆశయం. దీన్ని చేరుకోవాలంటే ఒక బలమైన పునాది వేసుకోవాలి. అందుకు ఈ వరల్డ్‌కప్‌ను సరైన వేదికగా భావించా. 2023 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో నేను సభ్యురాలినే అయినా నాకు అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడే అవకాశం రాలేదు. ఈసారి వరల్డ్‌కప్‌ మొదలయ్యే ముందు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి నాకు ఈ విషయంలో ఒక స్పష్టమైన హామీ లభించింది” అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో త్రిష సంతోషం వ్యక్తం చేశారు.