`నాక్’ గ్రేడ్ కోసం ముడుపులు.. కేఎల్‌ యూనివర్సిటీ విసి అరెస్ట్

`నాక్’ గ్రేడ్ కోసం ముడుపులు.. కేఎల్‌ యూనివర్సిటీ విసి అరెస్ట్

గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయానికి ఏ++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చిన ఆ సంస్థ యాజమాన్యంపైన, తీసుకున్న సభ్యులపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం ఇందులో 14 మందిని నిందితులుగా చేర్చింది.  సీబీఐ అరెస్ట్ చేసిన 10 మందిలో కేఎల్​ఈఎఫ్​ వైస్‌ ఛాన్సలర్‌ జీ.పి.సారథి వర్మ, వైస్‌ ప్రెసిడెంట్‌ కోనేరు రాజ హరీన్‌, కేఎల్​యూ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఎ.రామకృష్ణ ఉన్నారు.

కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్‌-కేఎల్​ఈఎఫ్ ప్రెసిడెంట్‌, ఇతర ప్రతినిధులతోపాటు న్యాక్‌ తనిఖీ బృందంలోని 10 మంది సభ్యులను నిందితులుగా సీబీఐ పేర్కొంది. వీరిలో కేఎల్​యూ యాజమాన్య ప్రతినిధులతోపాటు, దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లూ ఉండటం సంచలనంగా మారింది. 

ఢిల్లీ, విశాఖ నుంచి వచ్చిన సీబీఐ బృందాలు విజయవాడ గవర్నర్​పేటలోని కేఎల్​యూ పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్‌లో సోదాలు చేపట్టాయి. శనివారం రాత్రి 10 గంటల తర్వాత కూడా తనిఖీలు కొనసాగాయి. ఏ++ రేటింగ్ కోసం వర్సిటీ యాజమాన్యం నగదు, బంగారం, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్ల రూపంలో న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లు సీబీఐకి ఫిర్యాదులు వెళ్లాయి.

కేసు నమోదు చేసిన సీబీఐ ఆఘమేఘాలపై దిల్లీ నుంచి బృందాలను పంపింది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, సంబల్‌పూర్‌, భోపాల్‌, బిలాస్‌పూర్‌, గౌతమ్‌ బుద్ధనగర్‌, న్యూడిల్లీలోని 20 చోట్ల న్యాక్‌ బృంద సభ్యుల నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశాయి. వారి వద్ద నుంచి రూ.37 లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, ఒక ఐఫోన్‌ స్వాధీనం చేసుకున్నాయి.

అదేవిధంగా న్యాక్‌ తనిఖీ బృందం ఛైర్మన్‌, రామచంద్ర చంద్రవంశీ విశ్వవిద్యాలయం వీసీ సమరేంద్రనాథ్‌ సాహా, న్యాక్ తనిఖీ బృందం సభ్య సమన్వయకర్త, జేఎన్​యూ డిల్లీ ప్రొఫెసర్‌ రాజీవ్‌ సిజిరియా, భారత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లా డీన్‌ డాక్టర్‌ డి. గోపాల్‌, భోపాల్‌లోని జగ్రాన్‌ లేక్‌ సిటీ విశ్వవిద్యాలయం డీన్‌ రాజేశ్‌ సింగ్‌ పవర్‌, జీఎల్.బజాజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ మాసన్‌కుమార్ మిశ్రా, దేవనగరి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ గాయత్రి దేవరాజ, సంబల్‌పూర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్ బులు మహారాణా ఉన్నారు.

కేఎల్ఈఎఫ్ ప్రెసిడెంట్‌ కోనేరు సత్యనారాయణ, న్యాక్‌ మాజీ డిప్యూటీ సలహాదారు డాక్టర్‌ ఎల్. మంజునాథరావు, బెంగళూరు విశ్వవిద్యాలయం డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ ఎం.హనుమంతప్ప, న్యాక్‌ సలహాదారు ఎం. శ్యామ్‌సుందర్‌ అరెస్టైన వారు కాకుండా మిగతా నిందితులుగా ఉన్నారు.