బిజెపి గూటికి చేరిన 8 మంది ఆప్ మాజీ ఎమ్మెల్యేలు

బిజెపి గూటికి చేరిన 8 మంది ఆప్ మాజీ ఎమ్మెల్యేలు
 
అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉన్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు శనివారంనాడు బీజేపీలో చేరారు. వీరితో పాటు పలువురు కౌన్సిలర్లు సైతం బీజేపీ కండువా కప్పుకున్నారు.  కాగా, ఆప్‌కు రాజీనామా చేసిన ఈ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే ముందు తమ ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు. 
 
బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యేలలో భావన కౌర్ రెండు సార్లు పాలమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, మదన్‌లాల్ మూడుసార్లు కస్తూర్బా నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గిరిష్ సోని మూడుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యే కాగా, రాజేష్ రిషి రెండు సార్లు ఎన్నికయ్యారు. వీరితో పాటు నరేష్ యాదవ్, పవన్ శర్మ, బీఎస్ జూన్, రోహిత్ మెహ్రోలియా, బిజేంద్ర గార్గ్ బీజేపీలో చేరారు. ఆప్ కౌన్సిలర్ జయ్ రాయ్ సైతం కమలం గూటికి చేరారు.

ఆప్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని, అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పార్టీ టిక్కెట్ దక్కలేదు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామ చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ బీజేపీ ఇన్‌చార్జి బైజంయత్ పాండ, ఢిల్లీ బీజేపీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ సమక్షంలో ఆ పార్టీలోకి చేరారు. 

పార్టీలో చేరిన నేతలకు పాండ స్వాగతం పలికారు. అప్‌దా నుంచి నేతలు విముక్తి పొందడం చారిత్రకమని, ఢిల్లీ 5న జరిగే ఎన్నికలతో ఆప్‌దా నుంచి ఢిల్లీ సైతం విముక్తి పొందుతుందని పాండ స్పష్టం చేశారు.  “ఢిల్లీ రాజకీయాల్లో ఇది చారిత్రక దినం. వాళ్లంతా ‘ఆప్‌‌ద’ నుంచి బయటపడ్డారు. ఫిబ్రవరి 5న పోలింగ్ తర్వాత దిల్లీ కూడా ‘ఆప్‌ద’ నుంచి బయటపడుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా, డిల్లీలో ఆప్‌నకు బలంగా ఎదురుగాలి వీస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. “ఆప్ నడుపుతున్న 3జీ ప్రభుత్వంలో ఘప్లా(అస్తవ్యస్తం), ఘుస్ బైఠియో కో పనా(చొరబాటుదారులకు ఆశ్రయం), ఘోటాలా(కుంభకోణం) మాత్రమే ఉన్నాయి. అందుకే ఆప్‌నకు వ్యతిరేకత ఎదురవుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి కుంభకోణాలు, అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం అనేవి ఆప్ చేసిన పెద్దతప్పులని షా ధ్వజమెత్తారు. 

డిల్లీలోని ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. దిల్లీ ప్రజలంతా చీపుర్లు చేతపట్టి మరీ ఆప్‌ను తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. “విశ్వాస ఘాతకుల చెర నుంచి మేం ఢిల్లీకి విముక్తి కల్పిస్తాం. ‘ఆప్’ద లేకుండా చేస్తాం. లిక్కర్ మాఫియా జాడ లేకుండా చేస్తాం” అని ఆయన తెలిపారు. 

“ప్రజలు ఓట్లు వేసేటప్పుడు చైతన్యవంతంగా వ్యవహరించాలి. కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించినా దిల్లీ అల్లర్లకు బాధ్యులైన వారు తిరిగి అధికారంలోకి వస్తారు. దిల్లీని కాపాడిన వాళ్లు కావాలా? దిల్లీలోని అల్లర్లలోకి నెట్టిన వాళ్లు కావాలా? ప్రజలే తేల్చుకోవాలి” అని అమిత్‌షా చెప్పారు. డిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కిస్తారు.