బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత

బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత

బిజెపి ఎంపిలపై నమోదైన క్రిమినల్‌ అక్రమ ప్రవేశం కేసును కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం ధృవీకరించింది. 1934 ఎయిర్‌క్రాప్ట్‌చట్టం ప్రకారం విచారణ సమయంలో సేకరించిన సమాచారాన్ని నెలలోపు సంబంధిత అధికారులకు అందించేందుకు జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర పోలీసులను అనుమతించింది.

ఎంపిలు, వారి సన్నిహితులపై చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలా వద్దా అని ఇన్‌చార్జి అధికారి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. మూడేళ్ల క్రితం డియోఘర్‌ విమానాశ్రయంలోని తమ చార్టర్డ్‌ విమానం టేకాఫ్‌ ఆలస్యమైందంటూ బిజెపి ఎంపిలు నిషికాంత్‌ దూబే, మనోజ్‌ తివారీ సహా ఇతరులు అక్రమంగా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఎటిసి) గదిలోకి ప్రవేశించారని జార్ఖండ్‌ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. 

భద్రతా నిబంధనలను ఉల్లంఘించి ప్రైవేట్‌ విమానాన్ని టేకాఫ్‌ చేయడానికి అనుమతించాలం నిదితులు ఎటిసి సిబ్బందిని బెదిరించడంతో పాటు వారిపై ఒత్తిడి తీసుకువచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. చట్టంలోని సెక్షన్‌ 12 బి ప్రకారం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) వ్రాతపూర్వక అనుమతితో అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే నేరాలను కోర్టు పరిగణించవచ్చని హైకోర్టు పేర్కొంది. 

ప్రస్తుత కేసులో అటువంటి ఫిర్యాదు లేనందున ఎఫ్‌ఐఆర్‌ను సమర్థించలేమని జార్ఖండ్‌ హైకోర్టు పేర్కొంది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  ఎటిసి నిషిద్ధ ప్రాంతమని, విమానాశ్రయంలోని ఈ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు నిందితులకు అధికారం లేదని జార్ఖండ్‌ ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు.

ఈ కేసు తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్‌ 18న సుప్రీంకోర్టు పేర్కొంది. తమ విమాన క్లియరెన్స్‌ కోసం ఎటిసి గదిలోకి ప్రవేశించినందుకు బిజెపి ఎంపిలు, సహ నిందితులపై జార్ఖండ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన నేరపూరిత అతిక్రమణ, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.