ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ

ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లోపోటీ
 
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే అర్హత కల్పించేలా కొత్త చట్టం తీసుకువస్తామని  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  ఇక నుంచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబం ఎంత పరిమాణం ఉంటుంది అనేది ప్రామాణికంగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. 
 
జనాభా ఒకప్పుడు భారం అని.. కానీ ఇప్పుడు అది ఆస్తి అని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో జనాభా తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ అయితే ఇది చాలా ప్రమాదకరమని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకుముందు జనాభాను నియంత్రించాలని ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లమని పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు జనాభా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. 
 
గతంలో ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటే గరిష్ఠంగా 25 కిలోల బియ్యం ఇచ్చేవాళ్లమని, అతకంటే ఎక్కువ ఉన్నా25 కిలోలకు మించి ఇచ్చేవాళ్లం కాదని గుర్తు చేశారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే అనర్హులుగా గుర్తిస్తూ చట్టం తెచ్చామని గుర్తు చేశారు.  అయితే అదంతా అప్పటి పరిస్థితి అని, ఇప్పుడు జనాభా పెంచాలని తెలిపారు. 
 
అందుకే ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ జనాభా 2026లో 5.38 కోట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్న చంద్రబాబు 2031 వరకు ఆ సంఖ్య 5.42 కోట్లకు పెరుగుతుందని, ఆ తర్వాత 2036లో 5.44 కోట్లకు చేరుతుందని చెప్పారు. అయితే 2041లో మాత్రం ఏపీ జనాభా 5.42 కోట్లకు తగ్గిపోయి, అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుందని చంద్రబాబు హెచ్చరించారు.
 
ఇక 2026లో రాష్ట్రంలో ఒక జంటకు సగటున 1.51 మంది జన్మిస్తే (టోటల్‌ ఫెర్టిలిటీ రేట్‌-టీఎఫ్‌ఆర్‌), అదే 2051 నాటికి 1.07కి తగ్గిపోతుందని అంచనాలు చెబుతున్నాయని చంద్రబాబు గణాంకాలు వివరించారు. ఇది చాలా ప్రమాదకరం అని చెబుతూ ఒక జంటకు సగటున 2.1 మంది పిల్లలు జన్మిస్తేనే జనాభా స్థిరంగా ఉంటుందని తెలిపారు.
 
మన తల్లితండ్రులకు నలుగురు, ఐదుగురు పిల్లలు ఉండేవారని, ఆ సంఖ్యను ఒకటి, రెండుకు తగ్గించమని, ఇప్పుడు మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు అసలు పిల్లలే వద్దని- జీవితం అనుభవించడం కోసం అంటున్నారని చెప్పారు. దక్షిణ కొరియా, జపాన్, ఐరోపా దేశాలు జనాభా విషయంలో ముందుగా మేల్కొనక పోవడంతో ఇప్పుడు జనాభా తగ్గుముఖం పట్టి వృద్ధులతో సంక్షోభం ఎదుర్కొంటున్నాయని ఆయన గుర్తు చేశారు.
 
మనకు జనాభానే ఆస్తి అని తెలిపిన చంద్రబాబు సంపాదన మీద పడి జనాభా పెంచడాన్ని మర్చిపోతే ఆ సంపద ఎవరికి ఇవ్వాలో తెలియదని పేర్కొన్నారు. భవిష్యత్తులో పెద్ద పెద్ద ఎయిర్‌పోర్టులు, విశాలమైన రోడ్లు ఉంటాయి కానీ వాటిని వాడుకునేందుకు మనుషులే ఉండరని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.