పాకిస్థాన్‌లో ముగ్గురు హిందువులు కిడ్నాప్‌

పాకిస్థాన్‌లో ముగ్గురు హిందువులు కిడ్నాప్‌
* 16 మంది నిర్మాణ రంగ కార్మికుల అపహరణ

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ముగ్గురు హిందువుల‌ను దొంగ‌ల ముఠా కిడ్నాప్ చేసింది. వాళ్ల‌కు చెందిన వ్య‌క్తుల‌ను రిలీజ్ చేయ‌కుంటే, ఆ హిందువుల‌ను చంపివేస్తామ‌ని బెదిరించారు. పంజాబ్ ప్రావిన్సులోని ర‌హిమ్ యార్ ఖాన్ జిల్లాలోని బోంగ్ ఏరియాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. లాహోర్‌కు సుమారు 400 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్రాంతం ఉన్న‌ది.

షామ‌న్‌, ష‌మీర్‌, సాజ‌న్ అనే ముగ్గుర్ని దొంత‌లు ఎత్తుకెళ్లారు. బోంగ్లోని హెల్త్ సెంట‌ర్ వ‌ద్ద ఉన్న స‌మ‌యంలో.. అయిదుగురు వ్య‌క్తులు ఆయుధాల‌తో వ‌చ్చి గ‌న్‌పాయింట్‌లో బెదిరించి.. ముగ్గురు హిందువుల‌ను క‌చ్చా ఏరియాకు తీసుకెళ్లారు. ఆ త‌ర్వాత రింగు లీడ‌ర్ ఆషిక్ కొరాయి ఓ వీడియోను రిలీజ్ చేశాడు. త‌మ కుటుంబానికి చెందిన ప‌ది మందిని రిలీజ్ చేస్తేనే, కిడ్నాప్ అయిన ముగ్గురు హిందువుల‌ను సుర‌క్షితంగా రిలీజ్ చేస్తామ‌ని ఆ వీడియోలో పోలీసుల్ని బెదిరించాడు.

హిందువుల‌కు బేడీలు వేసి ఉన్నట్లు వీడియోలో చూపించారు. ఒక‌వేళ త‌మ స‌భ్యుల్ని రిలీజ్ చేయ‌కుంటే హిందువుల్ని చంపేసి, పోలీసుల‌పై దాడులు చేయ‌నున్న‌ట్లు ఆ వీడియోలో హెచ్చ‌రించారు. క‌చ్చా ఏరియాలో గ‌త ఏడాది దొంగ‌ల ముఠా చేసిన దాడిలో 12 మంది పోలీసులు మృతిచెందారు, ఏడు మంది గాయ‌ప‌డ్డారు.

పంజాబ్‌, సింధు ప్రావిన్సు స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌ క‌చ్చా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో దొంగ‌ల ముఠా సంచ‌రిస్తూ ఉంటుంది. చాలా శ‌క్తివంత‌మైన ఆ దొంగ‌ల ముఠాల‌ను ప‌ట్టుకునేందుకు పంజాబీ పోలీసులు ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే ప్ర‌తిసారి మైనార్టీల‌ను ఎత్తుకెళ్లి, పోలీసుల్ని బెదిరించ‌డం వాళ్ల‌కు అల‌వాటైపోయింది.

మరోవంక,పాకిస్తాన్‌లోని రెస్టివ్‌ ఖైబర్‌ ఫక్తూన్‌ఖవా ప్రావిన్స్‌లో గుర్తు తెలియని సాయుధాలు 16 మంది నిర్మాణ రంగ కార్మికులను కిడ్నాప్‌ చేశారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న వీరంతా నిర్మాణ ప్రాంతానికి వాహనంలో వెళుతుండగా అపహరించారు. ఆ వాహనానికి నిప్పంటించారు. 

ఈ ప్రాంతంలో నిషేధిత తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్తాన్‌ (టిటిపి) పనిచేస్తోంది, పైగా గతంలో ఇలాంటి అపహరణలకు పాల్పడిన సమాచారం వుంది. అల్‌ఖైదాకు సన్నిహితంగా పని చేస్తున్న ఈ సంస్ధ అనేక రకాలుగా దాడులు సాగిస్తోంది. మరో సంఘటనలో ట్యాంక్‌ జిల్లాలో 25కిలోల బాంబును అధికారులు నిర్వీర్యం చేశారు. 

వాయవ్య పాకిస్తాన్‌లోని మారుమూల జిల్లాలో డజన్ల సంఖ్యలో సాయుధ బలూచ్‌ వేర్పాటువాదులు అరాచకం సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌ దోపిడీకి పాల్పడ్డారు. ఒక పోలీసు స్టేషన్‌ను పాక్షికంగా దగ్ధం చేశారని పోలీసులు గురువారం తెలిపారు. భద్రతా బలగాలు వచ్చేలోపు వారక్కడ నుండి పారిపోయారు. 

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే వుందని చెప్పారు. కాగా బలూచిస్తాన్‌లోని ఖుజ్దార్‌లో జరిగిన దాడికి తమదే బాధ్యత అని నిషేదిత బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. ఇటీవలి కాలంలో వాయవ్య ఖైబర్‌ఫక్తునువా ప్రావిన్‌ఐస, బలూచిస్తాన్‌ల్లో తీవ్రవాదుల హింస పెరిగింది. బలూచ్‌ ఆర్మీ, పాకిస్తాన్‌ తాలిబన్‌ ఇందుకు కారణమని భావిస్తున్నారు.