సినిమా టికెట్ లపై రేవంత్‌ సర్కార్‌ మరో యూటర్న్‌

సినిమా టికెట్ లపై రేవంత్‌ సర్కార్‌ మరో యూటర్న్‌
భారీ విధాన ప్రకటనలు చేయడం, కొద్దీ రోజులకే వెనకడుగు వేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాటిగా మారుతూ వస్తుంది. పుష్ప-2 సినిమా విడుదల సమయంలో తొక్కిసలాట జరిగిన అనంతరం ‘ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు ఉండవు. అదనపు షోలు ఉండవు. టిక్కెట్‌ ధరలు పెంచబోం’ అంటూ రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగ గంభీరంగా ప్రకటించారు. అయితే నెల రోజులు కూడా గడవకముందే ప్రభుత్వం యూటర్న్‌ తీసుకున్నది. 
 
రామ్‌చరణ్‌ హీరోగా, దిల్‌రాజు నిర్మించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా బెనిఫిట్‌ షోలకు, అదనపు షోలకు, టిక్కెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.  అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు విలువ లేకుండా అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టిజీఎఫ్ డీసి) కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కు లొంగిపోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
దీంతో సినిమా టికెట్స్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు కు వచ్చిన సానుకూల వాతావరణం అంతా ఒక్కసారిగా తుడిచిపెట్టుకు పోయినట్లు అయింది. ఒక్క బెనిఫిట్ షో లకు మాత్రమే తెలంగాణ సర్కారు నో చెప్పింది. సినిమా విడుదల అయిన రోజు ఏకంగా ఆరు షో లకు అనుమతి ఇచ్చింది. 10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి బెనిఫిట్‌షోలు ప్రదర్శించేందుకు, ఆ రోజు 6 షోలు, 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. 
 
అంతేకాదు, 10న అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.150, సింగిల్‌ స్క్రీన్లలో రూ.100, 11-19 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.100, సింగిల్‌ స్క్రీన్లలో రూ.50 టిక్కెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్‌, మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రతిజ్ఞలు, ఇచ్చిన ప్రకటనలు వట్టి బూటకమేనా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
‘అసెంబ్లీలో సీఎం మాటకు ఉన్న విలువ ఇదేనా?’ అని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ సతీశ్‌రెడ్డి ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు. ఇది క్విడ్‌ప్రో కో కాదా? అని నిలదీశారు. ఆ సిని మా నిర్మాత దిల్‌రాజు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నారని, ఆయనకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం జీవోలు ఇవ్వడం నేరం కాదా? అని ప్రశ్నించారు.