ఎసిబి కార్యాలయం వద్ద హైడ్రామా… వెనుదిరిగిన కేటీఆర్

ఎసిబి కార్యాలయం వద్ద హైడ్రామా… వెనుదిరిగిన కేటీఆర్
ఫార్ములా-ఇ కార్ రేస్ లో విచారణకు హాజరయ్యేందుకు  ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు సోమవారం హాజరైన సందర్భంగా హై డ్రామా జరిగింది. తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ  వెనుదిరిగారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడి ఏసీబీ కార్యాలయానికి వచ్చా. కానీ రాజ్యాంగ బద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా రేవంత్‌ రాజ్యాంగం నడుస్తుందా? అని ప్రశ్నించారు. లీగల్‌ టీమ్‌తో రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు కేటీఆర్‌ను రోడ్డుపైనే అడ్డుకున్నారు. సుమారు 45 నిమిషాలపాటు అక్కడే ఉంచారు. హైకోర్టులో తీర్పు రిజర్వ్‌ చేశాక తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదని, అయినా చట్టం పట్ల గౌరవంతో రమ్మనమని నోటీసు జారీచేయడంతో వచ్చానని చెప్పారు. 
 
పైగా, తనను అడుగుతున్న సమాచారం మొత్తం ప్రభుత్వం వద్దే ఉందని, గతంలో ఒక మంత్రిగా ప్రభుత్వంలో తాను నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ తన  వద్ద సమాచారం ఉందని అపోహ పడుతున్నారని విమరసంచారు. తన వాదన ఇప్పటికే కోర్టులో చెప్పానాని, హై కోర్టు తీర్పు రిజర్వు చేసిందని చెబుతూ ఇంతలో తనను పిలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

అయినా తన వెంట న్యాయవాదులు ఉంటే ఈ ప్రభుత్వానికి సమస్య ఏంటో చెప్పాలని కెటిఆర్ నిలదీశారు. లేదా ఒక పౌరుడిగా తనకు న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు లేదనే విషయాన్ని రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ప్రస్తుతం విచారణ పేరుతో తనను ఇక్కడికి పిలిచి, తన ఇంటి పైన దాడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. 

 
ఈ దాడుల్లో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైనా చట్ట వ్యతిరేకమైన వస్తువులను ఉంచే కుట్ర కూడా జరుగుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. 
 
తనకు  ఏసీబీ ఇచ్చిన నోటీసులకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు వచ్చానని చెబుతూ  కనీసం లోపలికి వెళ్లేందుకు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని వాపోయారు.  కాగా, లాయర్‌తో విచారణకు హాజరు కావడానికి పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడి నుంచి కేటీఆర్‌ వెనుతిరిగారు. తన స్పందనను రోడ్డుపైనే ఏసీబీ అధికారులకు అందించారు.