చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో రూ.413 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు.  రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర మంత్రులు జి.కిషన్‌ రెడ్డి, వి.సోమన్న, రవనీత్‌ సింగ్‌, బండి సంజయ్‌, గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ కూడా హాజరయ్యారు. 

గత సంవత్సరం డిసెంబరు 28న ఈ టెర్మినల్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్‌ సింగ్‌ మరణంతో కార్యక్రమం వాయిదా పడింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా మెట్రో నెట్‌వర్క్‌ వెయ్యి కిలో మీటర్లకు పైగా పరిధి విస్తరించిందని తెలిపారు. 

తెలంగాణ, ఒడిశా, జమ్మూ కశ్మీర్​లో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని వెల్లడించారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామని, దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి హైస్పీడ్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయని, వీటిలో స్లీపర్‌ వంటి సౌకర్యాలను కల్పించనున్నామని గుర్తు చేశారు. నూతన రైల్వే ట్రాక్‌లతో పాటు అండర్‌ బ్రిడ్జి నిర్మాణాలు వేగవంతం చేస్తున్నామని, చర్లపల్లి టెర్మినల్‌ ద్వారా సికింద్రాబాద్‌, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.

ఓఆర్ఆర్‌కు అత్యంత సమీపంలో చర్లపల్లి ఉందని, తెలంగాణ ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతోందని, సోలార్ స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేశారని మోదీ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగ చర్లపల్లి లాంటి స్టేషన్లు ఎంతో అవసరమని పేర్కొంటూ 2014లో కేవలం 5 నగరాల్లోనే మెట్రో ఉందని, పదేళ్లలో 21 నగరాలకు మెట్రో విస్తరించిందని ప్రధాని మోదీ వివరించారు.

దేశ వ్యాప్తంగా హై స్పీడ్‌ రైళ్ల కోసం డిమాండ్‌ పెరుగుతోందని వెల్లడించారు. దేశంలో 35% విద్యుదీకరణ పూర్తయిందని, అమృత్‌ భారత్‌, వందేభారత్‌, నమో భారత్‌ రైళ్లు తెచ్చామని గుర్తు చేశారు. దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపు సంతరించుకుందని, రైల్వేల ఆధునికీకరణ దేశం ముఖచిత్రాన్నే మారుస్తోందని ఆయన చెప్పారు.

“తెలంగాణ, ఒడిశా, జమ్మూ కశ్మీర్​లో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషిచేస్తున్నాం. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. హైస్పీడ్‌ రైళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది” అని ప్రధాని తెలిపారు.  చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభించిన సందర్భంగా రేవంత్‌ రెడ్డి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్‌ ఎకానమీ సాధిస్తుందని తెలిపారు. తెలంగాణకు డ్రైపోర్టు ఇవ్వాలని, ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి సహకరించాలని, మెట్రో రైలు విస్తరణకు తోడ్పడాలని కోరారు.

కాగా ఈ నెల7వ తేదీ నుంచి సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ (12757-12758), గుంటూరు- సికింద్రాబాద్‌- గుంటూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17201-17202), సికింద్రాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌(17233-17234) రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాపేజ్‌ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ వెళ్లి వచ్చే రైళ్లు (12603-12604) మార్చి 7 నుంచి,. గోరఖ్‌పూర్‌- సికింద్రాబాద్‌ వెళ్లి వచ్చే రైళ్లు (12589-12590) మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్‌ నుంచే రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.