ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై అసెంబ్లీలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ఈ అంశంపై శాసనసభలో బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నియోజకవర్గాల్లో తమను పట్టించుకోవడం లేదని కనీస సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు.
 
తాము గౌరవం ఇస్తున్నప్పుడు, అధికార పార్టీ నేతలు కూడా అలానే ఉండాలన్నారు. సమసమానం అన్న నేతలు నిధులు కేటాయింపులో వివక్షత చూపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం చేసిన ప్రకటన మీద చర్చ సాగుతుంటే బీజేపీ సభ్యులు ప్రోటోకాల్‌పై మాట్లాడటం సరికాదని అధికార పక్ష సభ్యులు సూచించారు. 
 
స్పీకర్‌కు చేయి చూపిస్తూ మాట్లాడటంపై మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తాము కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డామని, ఆ ఆవేదన ఏలా ఉంటుందో తెలుసని చెబుతూ అందుకే ప్రత్యేకంగా బీజేపీ నేతలతో స్పీకర్‌ ఛాంబర్‌లో మాట్లాడుతామని తెలిపారు. సభను అమర్యాదపరిచేలా మాట్లాడవద్దని వారించిన స్పీకర్‌, సభ తర్వాత బీజేపీ సభ్యులను, మంత్రిని పిలిచి మాట్లాడుతానని చెప్పారు.

అంతకుముందు ఉదయం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా ట్రాక్టర్‌పై వచ్చారు. హైదర్‌గూడ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ మీదుగా అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న డిమాండ్‌తో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అసెంబ్లీలో కూడా హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.

మరోవంక, అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ప్రజాప్రతినిధులు నినాదాలు చేశారు. 

కేటీఆర్‌, హరీశ్‌ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ, రేవంత్‌ రెడ్డి ఫొటోతో కూడిన టీ షార్ట్స్‌ ధరించడం పట్ల భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్‌ వారిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి – అదానీ ఫొటో ముద్రించిన టీషర్టులు ధరించిన తమను అసెంబ్లీలో అనుమతించకపోవడంపై బీఆర్​ఎస్​ నేతలు మండిపడ్డారు. దీంతో అసెంబ్లీ గేట వద్ద నిరసన చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపలకి అదానీ, రేవంత్‌ ఫొటోతో టీషర్టులు తొలగించి వెళ్లాలని పోలీసులు సూచించారు. అయినా ఆ టీషర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చి చెప్పడంతో కొద్దిసేపటి వరకు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌ అదానీ భాయి భాయి అంటూ నినాదాలు చేశారు. 

ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్‌ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంతకుముందు గన్‌పార్క్‌ వద్ద అమరులకు నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులకు జోహార్‌.. వీరులకు జోహార్‌ అంటూ పాటపాడారు.