విశాఖ మెట్రో ప్రాజెక్టు మొదటి దశకు ఆమోదం

విశాఖ మెట్రో ప్రాజెక్టు మొదటి దశకు ఆమోదం
సాగర నగరం విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ సమగ్ర ప్రణాళిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మొత్తం 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు దాదాపు 34.4 కిలో మీటర్లు మేర మొదటి కారిడార్‌, గురుద్వార్ నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.08 కిలో మీటర్ల మేర రెండో కారిడార్‌, 6.75 కిలోమీటర్ల మేర తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు వరకు మూడో కారిడార్‌ నిర్మించనున్నారు. తొలిదశకు 11,498 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు 30.67 కిలోమీటర్ల మేర నాలుగో కారిడార్‌గా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో పెరిగిన రద్దీ నగరానికి ఇబ్బంది తెస్తోంది. ఒక్క మెట్రో మాత్రమే కాకుండా ఏక కాలంలో పై వంతెనలు కూడా నిర్మించాలని నగర వాసులు కోరుకుంటున్నారు. గాజువాక పోలీస్ స్టేషన్ సమీపంలో, మద్దిలపాలెం, తాడిచెట్లపాలెంలో పై వంతెనలు నిర్మించాలని విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు.