ఏపీ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య

ఏపీ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య
మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. ఇక హర్యాణా నుంచి రేఖా శర్మ, ఒడిశానుంచి సుజీత్‌ కుమార్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. గతంలో వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య, కొద్ది నెలల క్రితం రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్ల కోసం ఇప్పటికే ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. 
 
ఆంధ్రప్రదేశ్​లో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకి చెందిన ఆర్. కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామాలతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. మొత్తం 4 రాష్ట్రాల్లోని 6 ఖాళీలకు ఉప ఎన్నిక నిర్వహణకు నవంబర్ 26వ తేదీన షెడ్యూల్‌ విడుదల చేసింది.

వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సెప్టెంబర్ 23వ తేదీన రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు ఆర్‌. కృష్ణయ్య అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు సెప్టెంబర్ 24వ తేదీన ప్రకటించారు. పదవీ కాలం 4 సంవత్సరాలు ఉండగానే కృష్ణయ్య రాజీనామా చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందువలనే తన పదవికి రాజీనామా చేసినట్టు ఆ సమయంలో ఆర్‌.కృష్ణయ్య పేర్కొనడం గమనార్హం. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.కృష్ణయ్యకు బీజేపీ అవకాశం కల్పించింది.  2014లో ఎల్ బి నగర్ నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా ఆర్ కృష్ణయ్య తన ఎన్నికల రాజకీయాలు ప్రారంభించారు.

ఆయనను టిడిపి తెలంగాణకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఆ సమయంలో శాసనసభకు ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం ఏపీ నుండి వైసిపి అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, టిడిపి, వైసీపీలకు చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఆయా పార్టీలలో ఆయన క్రియాశీలంగా వ్యవహరింపలేదు. ఆయా పార్టీల అభివృద్ధికి రాజకీయంగా ఎటువంటి మద్దతు ఇచ్చిన దాఖలాలు లేవు.

 ఏపీలో ఖాళీగా ఉన్న మరో రెండు సీట్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావులు తరువాత టీడీపీలో చేరారు. దీంతో వారికే అవకాశం ఇస్తారా, లేదంటే మరొకరిని నామినేట్ చేస్తారా అనేది త్వరలోనే తెలిసిపోనుంది.