బియ్యం స్మగ్లింగ్ లో పవన్ జోక్యాన్ని స్వాగతించిన పురందేశ్వరి

బియ్యం స్మగ్లింగ్ లో పవన్ జోక్యాన్ని స్వాగతించిన పురందేశ్వరి
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు చెందిన బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్వాగతించారు. పీడిఎస్‌పై పవన్ కళ్యాణ్ తీసుకున్న చర్యలు సరైనవేనని ఆమె స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే తప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు.
 
విజయవాడలోని నిర్వహించిన సంఘటన్ పర్వ్ 2024 రాష్ట్ర స్థాయి సదస్సులో బీజేపీ నేతలతో కలిసి ఆమె పాల్గొంటూ  అంతర్జాతీయ పీడీఎస్ మాఫియాపై  పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం తప్పు కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని గోడౌన్లలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా తనిఖీలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో భాగంగా కాకినాడ పోర్ట్‌కు తరలిస్తున్నారని ఆమె విమర్శించారు.

గత పాలకుల్లో కొంత మంది ఈ అవినీతికి పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ బియ్యం వ్యవహారంపై తాము పలుమార్లు ప్రస్తావించిన విషయాన్ని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పీడీఎస్ బియ్యం అంశంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్న తీరు సరైనదేనని పురందేశ్వరి స్పష్టం చేశారు. 

పేదలకు అందించే బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఏడాది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చాలా తక్కువ సమయంలో11 కోట్ల మంది సభ్యత్వం పొందారని ఆమె  వివరించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 25 లక్షల మంది కొత్తగా బీజేపీలో సభ్యత్వం పొందారని చెప్పారు. అందుకు పార్టీ కార్యకర్తల కృషి ప్రశంసనీయమైనదని, కార్యకర్తల కృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.

భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతరంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆమె తెలిపారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు పెరుగుతుందని చెబుతూ హర్యానా, మహారాష్ట్రలలో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. ఇక జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరిగిందని చెప్పారు.

అదానీ వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. అదానీతో బీజేపీకి సంబంధం లేదని మాజీ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈవీఎం టాంపరింగ్ అంటూ బీజేపీపై విపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని  పురందేశ్వరి ఆరోపించారు.