తీరం దాటిన ‘ఫంగల్’ తుఫాన్

తీరం దాటిన ‘ఫంగల్’ తుఫాన్

* దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన!

నైరుతి బంగాళాఖాతంలోని ‘ఫెంగల్’తుపాన్ పూర్తిగా తీరం దాటింది. శనివారం రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుందని పేర్కొంది. ఈ ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇవాళ, రేపు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.

తుపాన్ ప్రభావంతో ఏపీలో విస్తారంగా  వర్షాలు కురుస్తున్నాయి. సీమ జిల్లాల్లో ఈ ప్రభావం మరి ఎక్కువగానూ ఉంది. వర్షం కారణంగా. తిరుమల నుంచి శ్రీవారి పాదాలు, పాపవినాశనం వెళ్లే మార్గాలను మూసివేశారు. శనివారం తిరుపతి జిల్లాలోని కేఎం అగ్రహారంలో అత్యధికంగా 13.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక తీర ప్రాంతాల్లో అయితే ఈదురుగాలల ప్రభావం ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల పంట నష్టం వాటిల్లింది. 

మరోవైపు తుపాను ప్రభావంతో  చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై నుంచి హైదరాబాద్‌ రావాల్సిన మూడు విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. 

హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్‌ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు పది విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. ముంబై, త్రిపుర వెళ్లే పలు విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు.

తుపాను బలహీనపడ్డా రాష్ట్రంలో రాబోయే రెండు రోజులూ భారీ వర్షాలుంటాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆది, సోమవారాల్లో వైఎస్సార్, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చిత్తూరు, వైఎస్సార్‌, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.