ఇస్రో డిసెంబరులో రెండు పీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీహరికోట ఈ ప్రయోగాలకు వేదిక కానుంది. ఈ నెల 4న నిర్వహించే పీఎస్ఎల్వీ-సీ59 ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. సూర్యుడి వాతావరణం, సౌర కరోనాను అధ్యయనం చేయడం ప్రోబా-3 మిషన్ లక్ష్యం.
గతంలోనూ ఈఎస్ఏకు చెందిన ప్రోబా-1 (2001), ప్రోబా-2 (2009)లను కూడా ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. 24న పీఎస్ఎల్వీ-సీ60 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు కూడా ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా రీశాట్-1బీ ఉపగ్రహంతో పాటు మరో నాలుగు విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది.
దాదాపు 200 మిలియన్ యూరోలతో అభివృద్ధి చేసిన ప్రోబా-3 మిషన్ రెండేళ్లపాటు కొనసాగనుంది. దీనిలో ఓక్యుల్టర్ స్పేస్క్రాఫ్ట్, కరోనాగ్రాఫ్ స్పేస్క్రాఫ్ట్ అనే ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రయోగం అనంతరం కక్ష్యలో ఈ రెండూ విడిపోయినప్పటికీ కచ్చితమైన సమన్వయంతో పనిచేస్తాయని, రెండూ కలిసి సోలార్ కరోనాగ్రాఫ్ను ఏర్పరుస్తాయని ఈఎస్ఏ వర్గాలు వెల్లడించాయి.
ప్రోబా-3లోని ఏఎస్పీఐఐసీఎస్ పరికరం సూర్యుని లోపలి, బాహ్య కరోనా వీక్షణను అందిస్తుంది. దీనిలో ఉండే 1.4 మీటర్ల డిస్క్ కరోనాను నిశితంగా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. డిజిటల్ అబ్సల్యూట్ రేడియోమీటర్ సూర్యుడి శక్తి ఉత్పత్తిని నిత్యం కొలుస్తుంది.
ప్రోబా-3ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెడితే.. తక్కువ ఖర్చుతోనే అంతరిక్ష ప్రయోగ సేవలందించే సంస్థగా నమ్మకం పెరగనుంది. అలాగే ఈ మిషన్ అందించే డేటా భారత శాస్త్రవేత్తలకు కూడా ఉపయోగపడనుంది. కొంతమంది భారతీయ పరిశోధకులు ఇప్పటికే బెల్జియం శాస్త్రవేత్తలతో కలిసి ప్రోబా-3 మిషన్ కోసం పనిచేశారు. సౌర అధ్యయనంలో కొత్త కోణాలను ఆవిష్కరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
More Stories
కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి