70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్

70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా అమలు చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వల్ల దేశంలోని 6 కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం కలగనుంది.  దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కూడా కేంద్రం నిధులు కేటాయించింది. అంతేకాకుండా మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

తాజాగా నిర్వహించిన కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు కూడా ఆయుష్మాన్ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  70 ఏళ్లు దాటిన వారికి కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వర్తింపజేస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంలో గొప్ప మానవతా దృక్పథం ఉందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్‌ సిటిజన్లు.. రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

 
అందుకోసం తొలుత రూ 3,730 కోట్లు కేటాయిస్తున్నారు. అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ నిధులు కేటాయిస్తుంటారు. ఇప్పటికే ఇతర కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య భీమా పధకాలు వర్తిస్తుంటే, వీటిల్లో ఒక పధకాన్ని వారు ఎంపిక చేసుకోవచ్చు. ప్రైవేట్ భీమా పధకాలు, రాష్త్ర ప్రభుత్వ భీమా పథకాలు వర్తిస్తున్న వారికి ఈ పథకం కూడా వర్తిస్తుంది.
 
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌లో ఈ ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ హెల్త్ కార్డులు అందిస్తారు. ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు ఈ హెల్త్ కార్డును ఉపయోగించి రూ. 5 లక్షల వరకు వైద్యసేవలను ఉచితంగా అందిస్తారు.
 
ఇదే కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం కల్పించారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ పథకానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.  ఈ పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయనుంది. అంతేకాకుండా 31,350 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టులకు రూ.12,461 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
 
అలాగే ఢిల్లీ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం – 4కి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. దీంతో రానున్న ఐదేళ్లలో గ్రామీణ రహదారుల కోసం రూ. 25 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ. 12,461 కోట్ల కేటాయించిన బడ్జెట్ ప్రతిపాదనలకు సైతం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం చెప్పిందని తెలిపారు.