బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల పట్ల ఆర్ఎస్ఎస్ ఆందోళన

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల పట్ల ఆర్ఎస్ఎస్ ఆందోళన

* బంగ్లాదేశ్‌లో హిందువుల కోసం కమిటీ ఏర్పాటు

బంగ్లాదేశ్‌లో గత కొద్ది రోజులుగా పాలన మార్పు కోసం జరుగుతున్న ఉద్యమంలో హిందువులు, బౌద్ధులు, ఇతర మైనారిటీ వర్గాలపై జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లోని హిందూ, ఇతర మతపరమైన మైనారిటీలకు చెందిన మహిళలపై లక్ష్యంగా చేసుకున్న హత్యలు, దోపిడీలు, దహనం, క్రూరమైన నేరాలు, హిందూ మందిరాలపై దాడులు సహించలేనివని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ  హోసబలే స్పష్టం చేశారు.
 
దీన్ని ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెబుతూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అటువంటి సంఘటనలను తక్షణమే ఆపడానికి కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, బాధితుల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. ఈ క్లిష్ట సమయంలో హింసించబడుతున్న హిందూ, బౌద్ధ మొదలైన వర్గాలకు సంఘీభావంగా నిలవాలని ప్రపంచ సమాజాన్ని,భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలను  హోసబాలే అభ్యర్ధించారు.
 
స్నేహపూర్వక పొరుగు దేశంగా, బంగ్లాదేశ్‌లో ఈ పరిస్థితిలో భారత్ ప్రభుత్వం సమర్థ పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, బౌద్ధులు మొదలైన వారి భద్రతకు ప్రభుత్వం ప్రతి ప్రయత్నం చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కోరింది.
 
మరోవంక, హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో నివాసం ఉంటున్న భారతీయులు, హిందువులు, మైనారిటీల భద్రత, సౌకర్యాలకు సంబంధించి అక్కడి హోంమంత్రిత్వ శాఖ అధికారులతో ఈ కమిటీ చర్చలు జరుపనున్నది. భారత్‌ – బంగ్లాదేశ్‌ సరిహద్దులో భద్రత, ప్రస్తుత పరిస్థితులను సైతం సమీక్షించనున్నది.
 
బంగ్లాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మోదీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈస్ట్ జోన్ ఏడీజీని కమిటీకి చైర్మన్‌గా నియమించారు. బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఐజీ, ఐజీ బీఎస్ఎఫ్ త్రిపుర, ఇండియన్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీకి చెందిన ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సభ్యుడు, సెక్రటరీ సభ్యులుగా ఉంటారు.
 
వాస్తవానికి ఇస్లామిక్‌ ఛాందసవాదులు బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. సోమవారం మొదలైన దాడుల్లో ఇప్పటి వరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాడుల భయంతోనే అనేక కుటుంబాలు మూకుమ్మడిగా వలస వెళ్లాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని హిందువులు భారత్‌లోకి వచ్చేందుకు యత్నిస్తున్నారు. 
 
పశ్చిమ బెంగాల్‌ సరిహద్దులోని ఠాకూర్‌గావ్‌, పంచగఢ్‌ ప్రాంతాలకు వేలాది మంది హిందువులు చేరుకున్నారు. పలుచోట్ల ఇండ్లు, దుకాణాలతోపాటు దేవాలయాల్లోని విలువైన వస్తువులను సైతం దుండగులు దోచుకు వెళ్తున్నట్లు సమాచారం. అక్కడే ఉంటే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. 
 
అయితే, బంగ్లాదేశ్ బోర్డ్‌ గార్డ్‌ సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నా హిందూ కుటుంబాలు స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా లేవని, అయితే, భారత సరిహద్దుల్లోకి ప్రవేశించేందుకు వీసాలు లేవని అలోఖవ సంఘ అధ్యక్షుడు మోజక్రుల్ ఆలం కొచ్చి తెలిపారు. ప్రస్తుతం సరిహద్దుల్లో 5వేల మంది వరకు ఉన్నట్లుగా చెప్పారు.