![](https://nijamtoday.com/wp-content/uploads/2024/06/Sikkim-CM.webp)
కాగా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 32 స్థానాలకుగాను 31 స్థానాల్లో అధికార ఎస్కేఎం ఘన విజయం సాధించింది. 2019కి ముందు ఏకంగా 25 ఏండ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన ప్రతిపక్ష ‘సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్ డి ఎఫ్)’ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. కాగా ప్రేమ్సింగ్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ఇది వరుసగా రెండోసారి. 2019 నుంచి 2024 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు.
తమాంగ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి 30 వేల మందికి ఆహ్వానించారు. ప్రమాణస్వీకారానికి కొన్ని నిమిషాల ముందు కార్యక్రమానికి విచ్చేసిన వారికి తమాంగ్ అభివాదం చేశారు. ఈ సందర్భంగా పటాసులు కాల్చి అభిమానులు సంబురాలు చేసుకున్నారు. కాగా మరోసారి సిక్కిం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 56 ఏండ్ల ప్రేమ్ సింగ్ తమాంగ్ రాష్ట్ర ప్రజల నుంచి మంచి ఆదరణ పొందారు.
తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న జన్మించారు. బంగాల్లోని దార్జీలింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1990లో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. మూడేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి రాజకీయాలవైపు మళ్లారు. 1994లో పవన్ చామ్లింగ్తో కలిసి ఎస్డీఎఫ్ను స్థాపించారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2009 ఎన్నికల తర్వాత తమాంగ్కు పార్టీతో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేగా గెలుపొందినా, పవన్ చామ్లింగ్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.
తన రాజకీయ గురువైన చామ్లింగ్ బంధుప్రీతి, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపిస్తూ, ఆయనపై తిరుగుబావుటా ఎగురవేశారు. 2013లో సొంతంగా ఎస్కేఎంను స్థాపించారు. 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎస్కేఎం 10 స్థానాలు దక్కించుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే 1994-1999 మధ్య పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.10 లక్షల ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారన్న అభియోగంతో నమోదైన కేసులో తమాంగ్కు ఏడాది జైలుశిక్ష పడింది. 2018లో జైలు నుంచి విడుదలయ్యారు.
ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయన పార్టీకి పట్టం కట్టారు. 17 స్థానాలు గెల్చుకొని ఎస్కేఎం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తమాంగ్ సీఎం పీఠమెక్కారు. గత ఐదేళ్లలో తమాంగ్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో 17 సీట్లు సాధించి 25 ఏండ్ల ఎస్డీఎఫ్ పాలనకు ముగింపు పలికారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 31 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష ఎస్డీఎఫ్కు ఘోర పరాభవం రుచి చూపించారు. ఇదిలావుంటే సిక్కింలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ పార్టీలకు ఈ ఎన్నికల్లో 20 వేల ఓట్లు కూడా రాలేదు.
More Stories
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్
మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం నేడే
ఆన్లైన్ వార్తలపై నియంత్రణకు బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లు!