ఓ నాయకుడు, లక్ష్యం లేని `ఇండియా’ కూటమి

ప్రతిపక్షాల `ఇండియా’ కూటమికి ఓ నాయకుడు గాని, ఓ లక్ష్యం అంటూ లేదని భారత కూటమికి నాయకుడే లేడని, ఉద్దేశం లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఒకవైపు బీజేపీ, ఎన్డీయే, మరోవైపు ‘అవినీతిమయమైన ఇండియా కూటమి’ ఈ ఎన్నికలలో ప్రజల ముందు ఉన్నట్లు ఆయన చెప్పారు.  పంజాబ్ లోని పాటియాలలో గురువారం ఆయన తొలి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ దేశాన్ని, సమాజాన్ని విభజించాలని కోరుకొంటున్న `ఇండియా’ కూటమి ఓ వైపు, భారత దేశాన్ని `వికసిత్ భారత్’ గా అభివృద్ధి చేయాలనుకొనే మోదీ మరోవైపు ఉన్నారని ఆయన తెలిపారు.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతుల ఆందోళనల మధ్య ర్యాలీ వేదిక వద్దకు చేరుకున్న ప్రధానికి బీజేపీ పాటియాలా అభ్యర్థి ప్రణీత్ కౌర్, ఫరీద్‌కోట్ అభ్యర్థి హన్స్ రాజ్ హన్స్, సంగ్రూర్ అభ్యర్థి అరవింద్ ఖన్నా, భటిండా అభ్యర్థి పరంపాల్ కౌర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖర్ తదితరులు స్వాగతం పలికారు.  సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ పంజాబ్‌  ముఖ్యమంత్రిని భగవంత్‌ మాన్‌ను లక్ష్యంగా చేసుకుని, తాను ఎప్పుడూ `ఢిల్లీ దర్భార్’లో  తన ఉనికిని చాటుకోవడంలో తీరిక లేకుండా ఉంటారని ఎద్దేవా చేశారు.

రానున్న ఐదు సంవత్సరాలలో ఐదుగురు ప్రధాన మంత్రుల గురించి ప్రతిపక్ష ఇండియా కూటమి మాట్లాడుతోందని  మహేంద్రగఢ్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.  ఆవు పాలు ఇవ్వక ముందే కూటమిలో నెయ్యి కోసం కీచులాట మొదలైందని ప్రధాని  ఎద్దేవా చేశారు. ఆరవ దశ ఎన్నికల ప్రచారం గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఆయన హర్యానాలోని ప్రసంగించారు. 

 తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవ్వరూ లాక్కోలేరని ప్రకటించారు. ఎన్నికలలో మీరు దేశ ప్రధాన మంత్రిని మాత్రమే ఎంపిక చేసుకోవడం లేదని, దేశ భవిష్యతును కూడా నిర్ణయిస్తున్నారని ఆయన ప్రజలనుద్దేశించి స్పష్టం చేశారు. మీరు స్వయంగా చూసి తెలుసుకున్న మీ సేవకుడు మోదీ ఒక పక్క, ఎవరో కూడా తెలియని వ్యక్తి మరో పక్క ఉన్నారని ఆయన తెలిపారు.

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కళగంలతో కూడిన ఇండియా కూటమిపై ధ్వజమెత్తుతూ అది పూర్తిగా మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అనుమతించలేదని ప్రధాని ఆరోపించారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు ఉంటారని ఇండియా కూటమి మాట్లాడుతోందని ఆయన విమర్శించారు.

1990 దశకంలో హర్యానాలో బిజెపి కోసం తాను పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకుంటూ, హర్యానా తన పట్ల చాలా ప్రేమ చూపిందని, తనకు ఇక్కడి ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయని మోదీ  తెలిపారు. హర్యానా అభివృద్ధి ఆగదని తాను హామీ ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. 

కాంగ్రెస్ చేసిన పాపాలను కడిగేందుకు గత పదేళ్లు చాలా కష్టపడ్డామని ఆయన చెప్పారు. తమ ఓటమికి ఎవరిని నిందించాలో ఇండియా కూటమి అప్పుడే సాకులు వెతకడం మొదలు పెట్టిందని ఆయన విమర్శించారు. హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు మే 25న(శనివారం) పోలింగ్ జరగనున్నది. గురువారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది.